తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై ఇంత పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల మౌనం వెనుక కారణమేంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. రహస్యంగా జరగాల్సిన డీఎస్సీ ప్రశ్నా పత్రాల తయారీ, అప్ లోడింగ్ అవుట్ సోర్సింగ్ వారికి అప్పగించారని, అందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు.
ఈ వ్యవహారం బయటకు రావడంతో మెరిట్ లిస్ట్లో ఉన్న నవీన్ పేరును, డేటాను తీసేశారని, డీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందనడానికి ఇంతకన్నా ఆధారం ఏముందన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుఘెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
‘స్పోర్ట్స్ కోటాలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయి. జీవోలు ఇచ్చి పరీక్షలు లేకుండానే స్పోర్స్ కోటాలో ఉద్యోగాలిచ్చుకున్నారు. తమ పని పూర్తవ్వగానే జీవోలను రద్దు చేశారు. కేవలం ఇంటర్ కాలేజీల స్థాయిలో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చుకున్నారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వలేదు. దుర్గయ్యను పక్కన పెట్టి ఇంటర్ స్థాయిలో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చారు. దుర్గయ్యకు జరిగింది అన్యాయం కాదా
ఒక్కో పోస్టును ఒక్కో రేటుకు అమ్ముకున్నారు. ఉద్యోగం కోసం జరిగిన బేరసారాల ఆడియో వీడియోలు బయటపడ్డాయి. పక్కా ఆధారాలున్నప్పటికీ లోకేష్ సమాధానం చెప్పకుండా ఛాలెంజ్ లు విసురుతున్నాడు. తప్పు జరగనప్పుడు మీకు భయమెందుకు?, దమ్ముంటే సిబిఐతో విచారణ జరిపించండి.
బాధితులు జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చాకే డీఎస్సీ అక్రమాలపై పోరాటం మొదలుపెట్టాం. రూ. 9500 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టేశారు. విద్యార్ధులు చదువుకోవాలా... మీచుట్టూ తిరగాలా?, మీ కొడుకు లోకేష్ ఒక్కడు బాగుంటే చాలా రాష్ట్ర ప్రజల సంక్షేమం మీకు అవసరం లేదా చంద్రబాబు. తక్షణమే లోకేష్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.


