నగరి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతవహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ నగిరి నియోజక వర్గంలో ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన రాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పుత్తూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రోజా మాట్లాడారు.
‘‘ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. ఆ తర్వాత జరిగిన అవకతవకతల గురించి చూశాం. క్వశ్చన్ పేపర్ తయారు చేసే నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అక్కడే మీకు పేపర్ లీకేజ్ అయింది అనేది అందరికీ అర్థమయింది.
పేపర్ లీకేజ్ కాకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? రెండో ర్యాంక్ నుంచి ఎందుకు ఇచ్చారు అనేది వాళ్లు చెప్పాలి. రెండోది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్ ద్వారా సర్టిఫికేట్లు వెరిఫై చేసే ఉద్యోగాలు ఇస్తారు. కానీ వీళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాక దొంగ జీవోలు తీసుకొచ్చారు. పోస్ట్ లను అమ్ముకునేందుకు దాని ద్వారా డబ్బులు దోచుకోవడానికి ఈ జీవోలని వాడారు’’ అని వ్యాఖ్యానించారు.


