సాక్షి, కాకినాడ: కూటమి ప్రభుత్వం ఆడిండే ఆట పాడిందే పాట అన్న చందాన ప్రభుత్వం సాగుతుందని మాజీమంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు పాలనలో "ఏపీ ఫర్ సేల్" అనే పరిస్ధితి వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి పని చేయ్యాల్సిన చంద్రబాబు కార్పోరేట్ల పక్షాన నిలబడ్డాడని ధ్వజమెత్తారు. ఈ రోజు (మంగళవారం) కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి తన సొంత మనుషుల కోసం.. కార్పొరేట్ సంస్ధల కోసమేనని తేటతెల్లమైందన్నారు.
కన్నబాబు మాట్లాడుతూ..పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని ఏం చేయ్యాలనుకుంటున్నారు. ప్రభుత్వమే గ్యాప్ ఫండింగ్ తో పాటుగా వడ్డీ లేని రుణాలను ప్రైవేటు సంస్ధలకు కట్టబెడుతుంది.ప్రభుత్వ ఆస్ధులు..వనరులను దోచి పెట్టి యూజర్ ఛార్జీల పేరుతో ప్రైవేటు సంస్ధలు దోచుకునేలా చేస్తున్నారు. పీపీపీకీ ఇవ్వకుండా ఇంకా ఏ రంగం మిగిలింది? వ్యవసాయం గిట్టుబాటు కాదని వదిలేసినట్లు ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీ క్రింద నడపండి. ఇప్పటికే ఆర్టిసీ ఆస్ధులను ప్రైవేటు పరం చేస్తున్నారు. అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయ్యాలనుకుంటుందని చంద్రబాబును భుజాన మోసే కార్యక్రమంలో పచ్చ మీడియా సంస్థలు అన్ని మరచిపోయాయని ధ్వజమెత్తారు. ఈనాడులో పీపీపీ మీద ఆహ ఓహో అంటూ రాస్తారా? ఇదే మీ రామోజీ ఫిల్మ్ సిటీ ఐతే ఒప్పుకుంటారా? పీపీపీ పాలసీ సిగ్గు చేటు...ప్రజలకు ప్రమాదకరమని ఒక్కసారి ప్రభుత్వ రంగ ఆస్ధులను కట్టబెడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేరని అన్నారు. ఈ అధికారం మీకు ఎవ్వరూ ఇచ్చారని ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఆస్ధులను పప్పు బెల్లాల్లా పంచేస్తారా అని విమర్శించారు. నవ్విపోదురు గాక నాకేంటీ సిగ్గూ అని మీరు అనుకుంటే... ప్రజలు నవ్వే పరిస్థితి లో లేరని, పీపీపీ పాలసీని ఎండగట్టే పరిస్ధితి వచ్చిందన్నారు.
పీపీపీ ద్వారా డబ్బులు, రుణాలు, భూమి, ఆస్ధులను ప్రభుత్వమే ఇస్తుందని ప్రైవేటు సంస్ధలు యూజర్ ఛార్జీలను వసూల్ చేస్తుందని దోపిడికి తెర తీసి తరతరాలకు నష్టం చేస్తామంటే ఒప్పుకోమన్నారు. ముక్కు పిండి జనాల దగ్గర సేవలకు ఛార్జీలు వసూలు చేస్తామని పీపీపీ పాలసీ ద్వారా చెబుతున్నారు. పారిశుద్ధ్యం చేయ్యాల్సిన మున్సిపాలిటీని.. పంచాయితీలను ప్రైవేటు పరం చేస్తే చెత్త మీద పన్ను వేసినట్లు కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా వాళ్ళ సొంత మనుషులకు దోచి పెడతారు. వైజాగ్ లో ఆర్టీసీ స్ధలాన్ని ప్రైవేటు సంస్ధకు చంద్రబాబు ఇచ్చేశారు. అక్కడ నిర్మించిన సిఎంఆర్ మాల్ ఆర్టీసీ స్ధలం అని ఈ నాటీ యువతకు తెలియదు. జన్మభూమి నుండి నీరు చెట్టు వరకు అంతా దోపిడియే. ఆల్వీన్ మొదలు కొని కాకినాడ గోదావరి ఫెర్టిలైజర్ వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేశారు అని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు


