కామారెడ్డి : ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదరవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు కామారెడ్డి బీర్కూర్ మండలం మంజీరా నది చెక్ డ్యాం వద్ద తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.
‘మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదు. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నా. 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పినా మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు.
నేను అమ్ముడు పోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కండువా కప్పుకున్నాను. పాత కాంగ్రెస్ నాయకులు నేను రావడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 90 శాతం మంది నాతో వచ్చారు. ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి కోసమే. కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోను. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదు’ అని పేర్కొన్నారు.


