హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్వే(One-Way) విధానాన్ని అమలు చేయనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు వన్వే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పార్క్ చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు ఇప్పటికే పలు మార్లు ట్రయల్ రన్స్ నిర్వహించారు. వివిధ సమయాల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్దేశించిన కొన్ని మార్గాల్లో యు-టర్న్లను(U-turns) కూడా అనుమతించరు. ఎన్ఎఫ్సీఎల్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లే వాహనదారులను పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్స్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించిన పోలీసులు.. ఆగస్టు 18 నుంచి వన్వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపుల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.


