సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా?. వృద్దాప్య పెన్షన్లకు మంగళం పాడనుందా?. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ.. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ కోసం దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవడంతో పలువురు వృద్ధులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్థిక భారం కారణంగానే వృద్ధుల దరఖాస్తులను పక్కన పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త పెన్షన్లపై ప్రకటన.. వృద్ధులకు మాత్రం నిరీక్షణ
కొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళల వంటి వర్గాల దరఖాస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయం తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక భారం కారణంగానే ఆలస్యం?
కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తే ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే కారణంతోనే వృద్ధాప్య పెన్షన్లను ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వయసు మీద పడిన తమకు ప్రతి నెలా వచ్చే పెన్షన్ ఆధారంగా జీవనం సాగుతోందని, కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని వృద్ధులు కోరుతున్నారు.
ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
వృద్ధులకు అండగా ఉంటామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల విషయంలో జాప్యం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం అర్హతల పరిశీలన, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దశలవారీగా పెన్షన్ల ప్రక్రియ కొనసాగిస్తామని చెబుతోంది.


