సాక్షి, హైదరాబాద్ : అక్షరాల అర కోటి ఓట్లు చెత్త బుట్టలోకి చేరనున్నాయి. ‘సర్’ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు చివరి రోజైన సోమవారం కూడా గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఎలాంటి స్పందన కనిపించలేదు. సాయంత్రం వరకు హైదరాబాద్ జిల్లాలో 58.89 శాతం, రంగారెడ్డి జిల్లాలో 65.16 శాతం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 63.97 శాతం ఫారాలు మాత్రమే అధికారులకు అందాయి. చివరి రోజు అదనంగా కనీసం ఒక్క శాతం ఫారాలు కూడా అందలేదు. దీన్నిబట్టి దాదాపు 43 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఫారాలు అందజేసిన వారిలో తిరస్కరణకు గురయ్యేవి ఎక్కువగా ఉంటే, మరిన్ని ఓట్లు గల్లంతవనున్నాయి. దీంతో దాదాపు అరకోటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని పరిశీలకులు చెబుతున్నారు. ముసాయిదా లో పేర్లు కనిపించని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్లో ఎక్కువ..
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 19.47 లక్షల ఫారాలు అందే అవకాశం లేని ఎన్నికల అధికారులు గుర్తించారు. వీరిలో ఆచూకీ లేని, చిరునామా మారిన, మరణించిన(ఏఎస్డీ) ఓటర్లున్నారు. జూబ్లీహిల్స్లో అత్యధికంగా 1,80,219, అత్యల్పంగా చార్మినార్లో 95,472 మంది ఉన్నారు. బహదూర్పురాలో 1,20,013, అంబర్పేటలో 1,19,628, మలక్పేటలో 1,47,433, ఖైరతాబాద్లో 1,24,135, కంటోన్మెంట్లో 1,05,356, ముషీరాబాద్లో 1,40,814, నాంపల్లిలో 1,37,757, సనత్నగర్లో 1,15,416, కార్వాన్లో 1,42,263, గోషామహల్లో 1,10,771, చాంద్రాయణగుట్టలో 1,49,749, సికింద్రాబాద్లో 1,03,594 మంది ఉన్నారు.


