ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్‌ బి’! | Centre Readies Plan B For Kharif Amid El Niño Threat | Sakshi
Sakshi News home page

ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్‌ బి’!

Jun 23 2026 7:23 AM | Updated on Jun 23 2026 10:36 AM

Centre Readies Plan B For Kharif Amid El Niño Threat

దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో భారత వ్యవసాయ రంగాన్ని ‘ఎల్ నినో’ భయం వణికిస్తోంది. సుమారు 9 నుంచి 10 రాష్ట్రాలపై ఈసారి ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న ముందస్తు అంచనాలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షభావ పరిస్థితులు ఎదురైతే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా ముందే ‘ప్లాన్ బి’ (ప్రత్యామ్నాయ ప్రణాళిక)ను సిద్ధం చేస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆ 10 రాష్ట్రాలపైనే నజర్
రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎల్ నినో కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న 9 నుంచి 10 రాష్ట్రాలను కేంద్రం గుర్తించింది. ఆయా రాష్ట్రాల్లోని అత్యంత వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే  జిల్లాలకు ప్రత్యేక వ్యూహాలను, పంటల వారీ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోని దాదాపు 326 జిల్లాల్లో వర్షపాతం తగ్గవచ్చని, పంట నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

క్షేత్రస్థాయికి శాస్త్రీయ సలహాలు
రైతులను ఆందోళనకు గురిచేసేలా కాకుండా, వారికి ధైర్యాన్నిస్తూ, సమస్యలను పరిష్కరించేలా శాస్త్రీయ సలహాలను అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగాలు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, విస్తరణాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రత్యామ్నాయ మార్గాలను చూపే బాధ్యతను వీరికి అప్పగించారు.

నీటి పొదుపు.. తేమ నిర్వహణే కీలకం
వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటి పరిరక్షణ, భూమిలో తేమ నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. మల్చింగ్ పద్ధతులు, అంతర పంటల సాగు, స్థానిక వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల రకాలను ప్రోత్సహించాలని సూచించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థల పరిశోధనలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, సకాలంలో రైతులకు చేరినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

పప్పుధాన్యాల స్వయంసమృద్ధిపై ఫోకస్
భారతదేశం పప్పుధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘పప్పుధాన్యాల స్వయంసమృద్ధి మిషన్’ కింద కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఎల్ నినో ముప్పు నేపథ్యంలో దేశీయంగా పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కంది, మినుము, పెసర పంటల సాగును విస్తరింపజేయాలని, పంటల మార్పిడి పద్ధతులను పెంచడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సహాయం అందించాలని రాష్ట్రాలను కోరింది.

ఎరువుల నిల్వలు సిద్ధం
వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సమీక్షలో వెల్లడించారు. అయితే, రుతుపవనాల గమనాన్ని బట్టి స్థానికంగా ఎక్కడైనా కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడికి ముందే ఎరువుల స్టాక్‌ను చేర్చాలని అధికారులను మంత్రి చౌహాన్ ఆదేశించారు. దేశంలోని జలాశయాల నీటి మట్టాలు, మార్కెట్ ధరలపై కూడా నిరంతర నిఘా ఉంచామన్నారు.

నిరంతర సమీక్షలు.. ఫీడ్‌బ్యాక్
ఈ సవాలుతో కూడిన ఖరీఫ్ సీజన్‌ను విజయవంతంగా అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సమన్వయం అవసరమని కేంద్రం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి ప్రతి వారం నివేదికలను, రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించాలని నిర్ణయించింది. వాతావరణ ముప్పులను ముందే అంచనా వేస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం ద్వారా ఖరీఫ్ పంటలను, రైతుల ఆదాయాన్ని కాపాడవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ భరోసా ఇస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement