బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి.. | Mother And Sons At Khammam Gandhi Nagar | Sakshi
Sakshi News home page

బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి..

Jun 22 2026 7:57 AM | Updated on Jun 22 2026 7:57 AM

Mother And Sons At Khammam Gandhi Nagar

ఖమ్మంక్రైం: సరైన ఉపాధి లేదు, వచ్చే డబ్బు సరిపోక ఇల్లు గడవడం ఇబ్బంది అవుతోంది.. స్వగ్రామం వెళ్లి కలోగంజి తాగుదాం... ఆ గ్రామం కూడా నగరానికి సమీపంలో ఉన్నది కదా అని ఓ వ్యక్తి తన భార్యకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించడమే పాపమైంది. అత్తగారింటికి వెళ్లడం ఇష్టం లేని ఆమె భర్తపై కక్ష సాధించడానికి బిస్కెట్లలో ఎలుకల మందు కలిపి తన ఇద్దరు కుమారులకు తినిపించి ఉసురు తీసింది. ఆపై తానూ ఎలుకల మందు మింగి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏడో డివిజన్‌ గుర్రాలపాడుకు చెందిన బొబ్బల లింగరాజు–స్వాతి దంపతులకు కుమారులు వేదిక్‌కుమార్‌(7), తనీష్‌(5) ఉన్నారు. 

లింగరాజు ఖమ్మంలోని ఓ సెల్‌ పాయింట్‌లో పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఖమ్మం గాంధీనగర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల ఆయన పనిచేస్తున్న షాప్‌ సరిగా నడవక ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తిరిగి గుర్రాలపాడుకు వెళ్దామని భార్య స్వాతితో చెప్పాడు. కానీ ఆమె మాత్రం ‘మీ ఊరికి రాను, ఇక్కడే ఉందాం’అంటూ చెప్పడంతో ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈక్రమాన లింగరాజు మాత్రం స్వగ్రామానికి వెళ్లక తప్పదని చెబుతూ ఆదివారం సామాన్లు సర్దాలని సూచించి ఇతర ఏర్పాట్ల కోసం శనివారం గుర్రాలపాడు వెళ్లాడు. దీంతో స్వాతి తట్టుకోలేక ఎలుకల మందు తీసుకొచ్చి బిస్కెట్లలో కలిపి తన పిల్లలిద్దరికీ తినిపించింది. ఆపై తాను కూడా మందు మింగింది. 

ఏం జరిగిందో చెప్పకుండా...
బిస్కెట్లు తిన్నాక కాసేటికి పెద్దకుమారుడైన వేదిక్‌ తనకు వాంతులు అవుతున్నాయని లింగరాజుకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఆయన ఖమ్మం వచ్చి తొలుత మెడికల్‌ షాపులో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ తెచ్చి తాగించాడు. అయినా పరిస్థితి మెరుగుపడకపోగా వేదిక్‌ అపస్మారక స్థితిలోకి వెళ్తుండడంతో పిల్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో స్వాతి, చిన్నకుమారుడైన తనీష్‌ బాగానే ఉండగా, ఎలుకల మందు తినిపించిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పలేదు. 

ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే వేదిక్‌ మృతి చెందాడు, అనంతరం లింగరాజు ఇంటికి వచ్చి భార్యను నిలదీయగా అప్పుడు పిల్లలకు బిస్కెట్లలో ఎలుకల మందు కలపడమే కాక తాను కూడా మింగానని చెప్పింది. ఈ మేరకు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా తనీష్‌ శనివారం అర్ధరాత్రి దాటాక మృతి చెందాడు. ఇక స్వాతికి చికిత్స కొనసాగుతుండగా, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement