డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ | NEET Protest Day 4 CJP Launches Unique Diaper Donation Drive Against Paper Leak | Sakshi
Sakshi News home page

డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ

Jun 23 2026 12:03 PM | Updated on Jun 23 2026 12:07 PM

NEET Protest Day 4 CJP Launches Unique Diaper Donation Drive Against Paper Leak

న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు.  జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్‌ను తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు.

ఉధృతమవుతున్న ఆందోళనలు 
గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. సోమవారం రాత్రి, నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్‌కు హాజరైన పలువురు నీట్ అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు.

తనిఖీల వివాదం – పోలీసుల వివరణ
ఈ నిరసనల్లో ఎస్ఎఫ్ఐ, ఐసా, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement