సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలంలోని కడప-చెన్నై ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాది బాలుడు, శ్రీకాళహస్తి కి చెందిన యస్విత అనే విద్యార్థి మృతి చెందారు. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.


