సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఆర్టీవో కార్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తున్న ఆర్టీవో అధికారి పైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం, టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పురు శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం అధికారులు స్కూల్ బస్సులు, వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్ను ఆపే ప్రయత్నం చేయగా.. ఆర్టీవో అధికారి వెంకన్నపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం, టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఊహించని ప్రమాదం కారణంగా వెంకన్న చనిపోవడంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, కొద్దిరోజుల క్రితమే బదిలీల్లో భాగంగా వెంకన్న గణపురం వచ్చినట్టు సమాచారం.



