పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్‌’ అభ్యర్థి ఆత్మహత్య | NEET Aspirant Dies by Suicide in Ghaziabad Last Video Under Probe | Sakshi
Sakshi News home page

పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్‌’ అభ్యర్థి ఆత్మహత్య

Jun 21 2026 1:01 PM | Updated on Jun 21 2026 1:08 PM

NEET Aspirant Dies by Suicide in Ghaziabad Last Video Under Probe

ఘజియాబాద్‌: దేశవ్యాప్తంగా నేడు (ఆదివారం) నీట్ యూజీ పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్షకు కొద్ది గంటలముందు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ‘నీట్‌’కు సిద్ధం అవుతున్న 22 ఏళ్ల ఒక యువకుడు తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మరణానికి కొద్ది నిమిషాల ముందు సదరు విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.

మొబైల్ వీడియోలో సంచలన నిజాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా విజయ్ నగర్ నివాసి అయిన జతిన్ కుమార్ అనే యువకుడు నీట్-యూజీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, అతడు తన గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా జతిన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ఒక వీడియో క్లిప్ లభ్యమైంది. తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందే జతిన్ దానిని రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో.. ఆదివారం జరగబోయే నీట్ పునఃపరీక్ష గురించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని ఆ యువకుడు స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్  వాస్తవికతను, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

అర్ధరాత్రి వరకు చదువుకుని.. 
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటే వరకు జతిన్ తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. తీరా శుక్రవారం ఉదయం నిద్ర లేపేందుకు వెళ్లిన బంధువులకు అతడు అపస్మారక స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోత్వాలి నగర్ పోలీసులు, గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఒక ఉరితాడు వేలాడుతూ ఉండటాన్ని, జతిన్ మృతదేహం కింద పడి ఉండటాన్ని గమనించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉపాసన పాండే ఈ కేసుపై స్పందిస్తూ.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

యూపీలో వరుస విషాదాలు
మే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు  అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఘాజియాబాద్‌లోనే కాకుండా, లక్నోలో కూడా 17 ఏళ్ల ఒక విద్యార్థిని మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మే 3 పరీక్షలో మంచి మార్కులు సాధించి, సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆ విద్యార్థిని పరీక్ష రద్దు కావడంతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement