అందరికీ మీరు ఆదర్శం | indian blind cricket team meet the pm modi | Sakshi
Sakshi News home page

అందరికీ మీరు ఆదర్శం

Mar 1 2017 12:34 AM | Updated on Aug 24 2018 2:20 PM

అందరికీ మీరు ఆదర్శం - Sakshi

అందరికీ మీరు ఆదర్శం

అంధుల టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంది.

అంధుల టి20 ప్రపంచకప్‌ విజేత భారత జట్టుపై ప్రధాని ప్రశంసలు
జట్టు సభ్యులతో భేటీ  


న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ‘టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత అంధుల క్రికెట్‌ చాంపియన్లతో గుర్తుండిపోయే విధంగా భేటీ జరిగింది. జాతీయ సీనియర్‌ జట్టు సాధించిన విజయాలతో ప్రేరణ చెందిన వీరంతా పాఠశాల స్థాయి నుంచే ఆటను కెరీర్‌గా మలుచుకున్నారు. ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్‌లోనూ ఇలాగే రాణించి దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చిన వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, స్నేహితులకు కూడా అభినందనలు తెలుపుతున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా ఆయనకు తమ సంతకాలతో కూడిన బ్యాట్, బంతి, మోదీ పేరుతో ఉన్న టీమ్‌ జెర్సీని ఆటగాళ్లు బహూకరించారు. అలాగే ప్రధాని కూడా వారికి బ్యాట్, బంతిని అందించారు. అనంతరం ప్రతీ ఆటగాడితో ఫొటో దిగి ట్విట్టర్‌లో పెట్టారు. టి20 అంధుల క్రికెట్‌ ప్రపంచ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు గత నెల 12న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి మరోసారి విజేతగా నిలిచింది. చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి సారథ్యం వహించగా... దున్నా వెంకటేశ్వరరావు, దుర్గా రావు, ప్రేమ్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement