
భారత జట్టు ముమ్మర ప్రాక్టీస్
వెస్టిండీస్తో జరగబోయే రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు తమ ప్రాక్టీస్ను ప్రారంభించింది. శనివారం నుంచి జరిగే రెండో టెస్టు
నెట్స్లో శ్రమించిన ఆటగాళ్లు
జమైకా: వెస్టిండీస్తో జరగబోయే రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు తమ ప్రాక్టీస్ను ప్రారంభించింది. శనివారం నుంచి జరిగే రెండో టెస్టు కోసం మంగళవారం కింగ్స్టన్కు చేరిన కోహ్లి సేన సబీనా పార్క్ మైదానంలో చెమటోడ్చింది. ఇక్కడి వేడి వాతావరణానికి అలవాటు పడేందుకు కఠినంగా ప్రాక్టీస్ చేసింది. రెగ్యులర్ వ్యాయామంతో పాటు విభిన్న రీతిలో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేసింది. కీపర్ వృద్ధిమాన్ సాహా తన కీపింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించగా ఓపెనర్ మురళీ విజయ్ తన బొటన వేలి గాయం కారణంగా తేలికపాటి వ్యాయామంతో సరిపుచ్చుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం ఎక్కువ సమయం నెట్స్లో గడిపాడు. మరోవైపు తొలి టెస్టులో తన ప్రదర్శన సంతృప్తినిచ్చిందని లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు.
ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచే విషయంలో తాను విజయవంతమైనట్టు తెలిపాడు. ‘ప్రతీ మ్యాచ్లో కచ్చితంగా వికెట్లు తీస్తామని చెప్పలేం. బాగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయడమే మన పని. ఈ ప్రయత్నంలో వికెట్లు అవే వస్తాయి. ఒక్కోసారి బౌలర్ల మధ్య భాగస్వామం కూడా ఫలితాన్నిస్తుంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ వికెట్లు తీస్తుండగా మరో ఎండ్లో నేను బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచగలిగాను. ఇక రెండో టెస్టులో నేను మరిన్ని వికెట్లు తీయాలనుకుంటున్నాను’ అని మిశ్రా తెలిపాడు.