మార్పుల్లేవ్

మార్పుల్లేవ్


* న్యూజిలాండ్‌తో సిరీస్‌కు

* భారత టెస్టు జట్టు ప్రకటన

* బిన్నీ, ఠాకూర్‌లకు నిరాశ


ముంబై: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో తలపడే భారత క్రికెట్ జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన జట్టునుంచి ఇద్దరిని తప్పించి 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. విండీస్ విదేశీ పర్యటన కావడంతో 17 మందితో వెళ్లిన భారత బృందంలో స్టువర్ట్ బిన్నీ, శార్దుల్ ఠాకూర్ మినహా మిగతా ఆటగాళ్లపైనే సెలక్టర్లు నమ్మకముంచారు. విండీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ వీరిద్దరికి తుది జట్టులో స్థానం లభించలేదు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఈ నెల 22నుంచి కాన్పూర్‌లో జరుగుతుంది.

 

సీనియర్ల పేర్లు పరిశీలించినా...

టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణించని శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు కమిటీ మరో అవకాశం ఇచ్చింది. ఓపెనర్లుగా ధావన్, విజయ్, రాహుల్ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో తుది జట్టులో ఎవరిని తీసుకోవాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్టమని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ అన్నారు. రోహిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా... అతనిలో మంచి ప్రతిభ ఉందని, రోహిత్‌కు తగినన్ని అవకాశాలు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. గౌతమ్ గంభీర్ సహా కొందరు సీనియర్ల గురించి కూడా చర్చ జరిగిందని, అయితే విదేశాల్లో సిరీస్ నెగ్గిన జట్టునే కొనసాగించాలని తాము భావించామని పాటిల్ చెప్పారు. ధావన్ మళ్లీ రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

జట్టు వివరాలు: విరాట్ కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, రాహుల్, పుజారా, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, ఉమేశ్, షమీ, భువనేశ్వర్, ఇషాంత్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top