శుబ్మన్ గిల్ (PC: BCCI X)
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.
కెప్టెన్గా నేను ఓకే.. WTC ఫైనల్ చేరతాం
‘‘కెప్టెన్గా నా పాత్రలో నేను ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాను. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడమే మా లక్ష్యం. అందుకోసం మేము ఆరు నుంచి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంది. కాబట్టి శ్రీలంక నుంచే ఆ పని మొదలుపెడతాము’’ అని గిల్ పేర్కొన్నాడు.
నాకు దక్కిన గొప్ప గౌరవం
అదే విధంగా.. ‘‘చారిత్రక 600వ టెస్టులో నాయకుడిగా టీమిండియాను ముందుకు నడిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అది కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడం మరింత విశేషం’’ అని గిల్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.
మా జట్టుతో సంతృప్తిగానే ఉన్నాం
కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)పై వస్తున్న విమర్శలపై గిల్ స్పందించాడు.
‘‘మేము CoEతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్ల గాయాల గురించి అప్డేట్లు తెలుసుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ సాయి సుదర్శన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి అతడిని టెస్టు మ్యాచ్లో ఆడించి రిస్క్ తీసుకోలేము. మా జట్టులో ఉన్న పదిహేను మంది సభ్యులతో ప్రస్తుతం సంతృప్తిగానే ఉన్నాము’’ అని గిల్ పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..
ఇదిలా ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. తాజా సీజన్లో మిగిలిన తొమ్మిది మ్యాచ్లలో కనీసం ఆరు మ్యాచ్లు తప్పక గెలవాల్సిందే. ఇందులో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కాస్త ఈజీ టార్గెట్. ఆ తర్వాత, న్యూజిలాండ్తో రెండు, ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.
వీటిలో కనీసం ఆరు గెలవడంతో పాటు రెండు డ్రా చేసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఏడు టెస్టులు గెలవాలి. ఇక ఈ సీజన్లో ఇప్పటికి టీమిండియా తొమ్మిది టెస్టులు పూర్తి చేసుకుని.. నాలుగు గెలిచి.. నాలుగు ఓడిపోయి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.


