టీమిండియా (PC: BCCI X)
భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భాగమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. తనకు ఏ పదవి ఇచ్చినా వంద శాతం న్యాయం చేస్తానంటూ మనలోని మాటను వెల్లడించాడు.
గంభీర్, అగార్కర్పై విమర్శలు
కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరి నేతృత్వంలో వైట్బాల్ క్రికెట్లో ఐసీసీ టోర్నీలో భారత జట్టు మంచి ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇటీవల ఘోర పరాభవాలు చవిచూసింది.
వరుస పరాభవాలు
ఎన్నడూలేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ కావడం.. పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్కు తొలిసారి వన్డే సిరీస్ కోల్పోవడం.. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్ కావడం.. ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ కావడం, వన్డే సిరీస్ను కోల్పోవడం తాజా ఉదాహరణలు.

చీఫ్ సెలక్టర్, హెడ్కోచ్ అయ్యేందుకు సిద్ధం
ఈ నేపథ్యంలో శ్రీలంకతో తాజాగా రెండు టెస్టుల సిరీస్ తర్వాత వీరి భవితవ్యంపై స్పష్టత రానుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హర్భజన్ సింగ్ బీసీసీఐలో ఏ పదవి ఇచ్చినా చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం గమనార్హం.
‘‘బీసీసీఐ అధ్యక్షుడు, చీఫ్ సెలక్టర్ లేదంటే హెడ్కోచ్... ఈ మూడింటిలో ఏ బాధ్యత ఇచ్చినా నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భారత క్రికెట్కు ఏ స్థాయిలోనైనా సేవ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషమే. భవిష్యత్తులో ఈ మూడింటిలో ప్రతీ పాత్ర పోషించాలని నేను కోరుకోవడం లేదు.
గంభీర్కు మద్దతు
అయితే, నా తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ నాకే గనుక నిజంగా అవకాశం వస్తే.. అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని భజ్జీ PTI ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా ప్రతీ దానికి గంభీర్ను విమర్శించడం తగదని.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అతడు ప్రతీ నిర్ణయం తీసుకుంటాడని అండగా నిలిచాడు.


