Photo Credit : BCCI Twitter
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలోనే బీసీసీఐ అత్యున్నత పదవిని అలంకరించనున్నట్లు సమాచారం. గంభీర్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా రానున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్కు బీసీసీఐ (హెడ్కోచ్ పదవికి మించి) డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా రూపొందించనున్న డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవికి లక్ష్మణ్ అయితేనే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ భావించింది. అంతేకాదు లక్ష్మణ్ ఆ పదవిలో తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తాడని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)కు సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం లక్ష్మణ్ సీవోఈ హెడ్గా ఆటగాళ్ల పునరావాసం, శిక్షణ వంటి బాధ్యతలు చూస్తున్నాడు. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్'గా నియమితులైతే, ఆయన పరిధి మరింత విస్తృతం కానుంది. సీనియర్ పురుషుల, మహిళల జట్ల వ్యూహరచన, జాతీయ సెలక్షన్ కమిటీతో సమన్వయం, జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు ఆటగాళ్ల ప్రగతిని పర్యవేక్షించడం వంటి కీలక అధికారాలు ఆయన చేతికి రానున్నాయి.
ఇదే సమయంలో, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం కూడా సెప్టెంబర్తో ముగియనుంది. ఆయన పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించాలా? లేక కొత్త వారిని నియమించాలా? అనే అంశంపై కూడా బీసీసీఐ చర్చిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంతో సమన్వయం కోసం లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టాలని బీసీసీఐ కోరినప్పటికీ, లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. బెంగళూరులోని నూతన సీవోఈ ప్రాజెక్టుపై దృష్టి సారించేందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గాడిన పడటంతో, ఆయన అనుభవాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.


