వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌కు టీమిండియా | Team India to tour England next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదీ ఇంగ్లండ్‌కు టీమిండియా

Jul 25 2025 4:23 AM | Updated on Jul 25 2025 4:23 AM

Team India to tour England next year

5 టి20లు, 3 వన్డేలు ఆడనున్న భారత్‌  

మాంచెస్టర్‌: ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌లో బిజీ షెడ్యూల్‌లో నిమగ్నమైంది. ఐదు టెస్టుల పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటోంది. అయితే వచ్చే ఏడాది కూడా టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడుతుంది. గురువారం ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఐదు టి20లతో పాటు మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ పాల్గొంటుంది. 

ఈసీబీ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మొదట జూలై 1న డర్హమ్‌లో జరిగే తొలి టి20తో పొట్టి సిరీస్‌ మొదలవుతుంది. రెండో మ్యాచ్‌ 4న మాంచెస్టర్‌లో, మూడో మ్యాచ్‌ 7న నాటింగ్‌హామ్‌లో, నాలుగో పోరు 9న బ్రిస్టల్‌లో, ఆఖరి పోరు 11న సౌతాంప్టన్‌లో జరుగనుంది. తర్వాత జూలై 14న బర్మింగ్‌హామ్, 16న కార్డిఫ్, 19న లార్డ్స్‌లలో మూడు వన్డేలు జరుగుతాయి. 

భారతే కాదు న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లతో ఇంగ్లండ్‌ 2026 సీజన్‌ అసాంతం బిజీ బిజీగా గడపనుంది. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో టి20, వన్డే సిరీస్‌లను నెగ్గిన భారత మహిళల జట్టు కూడా అక్కడికి వెళ్లనుంది. మూడు టి20లు, ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. మే 28, 30, జూన్‌ 2 తేదీల్లో చెమ్స్‌ఫోర్డ్, బ్రిస్టల్, టాంటన్‌ వేదికల్లో పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. జూలై 10 నుంచి లార్డ్స్‌ లో ఏకైక టెస్టు ఆడుతుంది.    

Advertisement
 
Advertisement
Advertisement