పద్మవ్యూహం అంటే..? | What Is Padmavyuham In Mahabharata: CN Murthy about Padmavyuham | Sakshi
Sakshi News home page

పద్మవ్యూహం అంటే..?

Mar 16 2026 2:17 AM | Updated on Mar 16 2026 2:17 AM

What Is Padmavyuham In Mahabharata: CN Murthy about Padmavyuham

ఎవరైనా తీవ్రసమస్యలు, కష్టాల్లో చిక్కుకుంటే వాళ్ళు పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అంటుంటాం. అలనాటి ద్వాపర యుగంలో 18 రోజులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో 13 వ రోజున కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని అమలు పరిచాడు. ఈ వ్యూహం చూసేందుకు పద్మం, చక్రం ఆకారంలో ఉండటంతో దీనిని పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం అని కూడా అంటారు. మొత్తం కౌరవ సైన్యాన్ని తామరపువ్వు ఆకారంలో ఉండేలా ఏడు వలయాలలో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యంగా పద్మవ్యూహాన్ని ద్రోణచార్యుడు ఏర్పాటు చేశారు. ఈ పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతుచిక్కనిదిగా ఉంటుంది. సామాన్యుడెవరూ, ఈ వ్యూహంలోకి వెళ్ళలేరు.

ఒకవేళ వెళ్లినా మృత్యువలయానికి దగ్గరవుతూ, సజీవంగా తిరిగి రాలేరు. అందుకే అతి పరాక్రమ వంతుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడే కానీ, తిరిగి రాలేక అమరుడయ్యాడు. ఈ వ్యూహాన్ని పాండవుల తరఫున ఛేదించగలిగిన వారు కేవలం శ్రీ కృష్ణుడు, అర్జునుడు, శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు, అర్జునుని కుమారుడైన అభిమన్యుడు మాత్రమే. అయితే శ్రీ కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే కానీ, వెనుకకు వచ్చే విద్య తెలియకపోవడం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు వీరమరణం పొండాడు. కేవలం శ్రీ కృష్ణుడు అర్జునుడు మాత్రమే ఈ పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన యోధులు. ఇక కౌరవుల తరఫున భీçష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామలు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించ గలిగినవారు.

పద్మవ్యూహ నిర్మాణం ఇలా....
కురుక్షేత్ర మహా సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారు. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, మరో 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతి దళాలు కలిపి 2,18,700 మంది మొత్తం సైన్యం ఉంటారు. దీనిని 18తో హెచ్చవేస్తే 39,36,600 మంది సైన్యం పాల్గొంటారు. సుమారుగా పద్మవ్యూహం విస్తీర్ణం 5,929 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు.

పద్మ వ్యూహంలో ఎవరెవరు ఏయే స్థానాల్లో...
కౌరవసేనలను తామరపూవు ఆకారంలో నిలిపిన ద్రోణుడు అలనాటి వివిధ దేశాధిపతులను తామరపూవులోని రేకుల మాదిరిగా నిలిపాడు. వారి కుమారులను పూవు మధ్యభాగంలోని కేసరాలుగా నిలబెట్టాడు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపల భాగంలో, వారి మధ్య దుర్యోధనుడు సైన్యంగా నిలిచారు. సైంధవుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు వారి కుమారులు ఇతర స్థానాల్లో నిలిచారు.  – సి.ఎన్‌.మూర్తి, పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement