బెంగళూరు: బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)కి చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆగస్టు 15న సంయుక్త ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆహ్వానాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయానికి చెందిన 2026 గ్రాడ్యుయేట్ల ఎన్రోల్మెంట్ను రాష్ట్ర బార్ కౌన్సిళ్లు నిలిపివేయాలని బీసీఐ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వులను బీసీఐ అనంతరం ఉపసంహరించుకుంది. అయితే ఈ చర్య దేశవ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపిందని ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు ఆరోపించారు. బాధ్యత వహించకుండా మిశ్రా హాజరుకావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, నల్సార్ వివాదంలో సీజేఐ హాజరును కూడా పునఃసమీక్షించాలని కోరుతున్నట్లు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై 165 మంది గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు, 409 మంది ప్రస్తుత విద్యార్థులు, 128 మంది పూర్వ విద్యార్థులు సంతకాలు చేశారు.
ఇది కూడా చదవండి: 4 నెలల్లో 22 మందికి మరణ శిక్ష.. యూపీ జడ్జి సంచలన తీర్పులు!


