PC: Sonysports X
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనూహ్య రీతిలో అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న అతడు.. తప్పుడు నిర్ణయం కారణంగా రనౌట్గా వెనుదిరిగాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు భారత్ శ్రీలంకకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కాస్త వేగంగా ఆడగా.. కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశాడు.
Off the Mark! 💥
Yashasvi Jaiswal gets going with a sweetly timed boundary. 👊
Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EYTG3ht7CY— Sony Sports Network (@SonySportsNetwk) August 15, 2026
దూకుడుగా జైసూ..
ఇక 37 బంతుల్లోనే 32 పరుగులతో జైస్వాల్ జోరు మీదున్న సమయంలో.. దురదృష్టం అతడిని వెంటాడింది. భారత ఇన్నింగ్స్ 11వ ఓవర్లో లంక అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ కేశారా నువాంత బంతితో రంగంలోకి దిగాడు.
ఈ క్రమంలో కేశారా వేసిన ఆఖరి బంతిని రాహుల్ మిడాన్ దిశగా బాదాడు. అయితే, కేశారా బంతిని ఆపే క్రమంలో జైసూ కాళ్లకు అడ్డుగా వచ్చాడు. దీంతో అదుపుతప్పిన జైసూ నేలమీద పడిపోయాడు. ఈలోపే కేఎల్ రాహుల్ సింగిల్ కోసం రాగా.. కిందపడి లేచిన తర్వాత కూడా జైసూ పరుగుకు సిద్ధంగా ఉన్నానన్నట్లుగా ముందుకు ఉరికాడు.
జైసూను రనౌట్ చేయనా?..
కానీ ఇంతలోనే లంక ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వైపు విసిరాడు. అప్పటికి రాహుల్, జైస్వాల్.. ఇద్దరూ బౌలర్ ఎండ్లోనే ఉన్నారు. వీరిలో ముందుగా రాహుల్ తన బ్యాట్ను నేలమీద పెట్టి సేఫ్ అయ్యాడు. అయితే, బంతిని అందుకున్నప్పటికీ డిక్వెల్లా వెంటనే బెయిల్స్ను పడగొట్టలేదు.
Yashasvi Jaiswal was looking so good and his timing today was brilliant, but this unfortunate run-out spoiled the day for him
He scored 32 at a strike rate of 88, but this run out....... #INDvsSL pic.twitter.com/lUtlbsBXpZ— Ajay Jadeja (@AjayJadeja171) August 15, 2026
ఇందులో తప్పేముంది?.. కానివ్వు!
రనౌట్ చేయనా అన్నట్లుగా కెప్టెన్ ధనంజయ డి సిల్వను అడిగాడు. ఇందుకు ధనంజయ.. ‘ఇందులో తప్పేముంది? కానివ్వు’ అన్నట్లుగా సైగ చేయడంతో డిక్వెల్లా బెయిల్స్ను పడగొట్టాడు. ఫలితంగా జైస్వాల్ రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా అటు కేశారా.. ఇటు రాహుల్తో పాటు జైసూ తొందరపాటు కారణంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
ఈ దారుణమైన మిక్సప్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కొంతమంది రాహుల్ను.. మరికొందను జైస్వాల్ను విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం తప్పంతా కేశారాదేనని తిట్టిపోస్తున్నారు. కాగా జైసూ రనౌట్ కాగానే రాహుల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఇక జైస్వాల్ 32 పరుగుల వద్ద అవుట్ కాగా.. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు.


