Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది.
అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది.
అంతేకాదు ఇంగ్లండ్తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.
2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు.
అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది.
అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.


