సాక్షి,ఢిల్లీ: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.యూజీసీ-నెట్ సోషియాలజీ పరీక్షకు ముందు 100 పేజీల PDF సర్క్యులేట్ అయిందని, అందులోని దాదాపు 90 ప్రశ్నలు అసలు పరీక్ష పేపర్తో మ్యాచ్ అయ్యాయన్నారు. నీట్ పరీక్ష పేపర్ ఉదంతం ముగిసి కొద్దిరోజులైన గడవక ముందే.. యూజీసీ నెట్ పేపర్కు సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. ఈ విషయమై ఎక్స్ ఖాతా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
గత వారం జరిగిన యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి వెలుగులోకి వచ్చిన తీవ్రమైన ఆరోపణలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని రాహుల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.."పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ విక్రయం జరిగింది. ఈ పీడీఎఫ్ ప్రశ్నపత్రం రూపకల్పనకు సంబంధించినది, ఇది కేవలం ఎన్టిఎ (NTA) వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది. - ఈ పీడీఎఫ్లోని దాదాపు 90 ప్రశ్నలు అసలు సోషియాలజీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నాయి". అని అన్నారు.
ఆ పీడీఎఫ్ని బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లలో రూ. 2.25 లక్షలకు అమ్ముతున్నారని. ఇదే నెట్వర్క్, సీఎస్ఐఆర్-నెట్, హెచ్టిఇటి, ఏడిఎ (ADA) వంటి రాబోయే పరీక్షలకు సైతం ప్రశ్నపత్రాలను అందిస్తున్నట్లు సమచారం అందిందని తెలిపారు. నీట్, నెట్లో పదే పదే కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పేపర్ లీక్ వ్యవహారంలో ఒక పెద్ద మాఫియా పని చేస్తుందని, వారిపై దృష్టి పెట్టాల్సింది పోయి... విద్యార్థులను, సోషల్ మీడియాను నియంత్రించాలని చూడటం సరికాదన్నారు. ఈ పేపర్ లీకేజీలను ఒక పెద్ద ఉద్యమంగా మార్చాలని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల గొంతుక ద్వారానే విద్యావ్యవస్థలో మార్పు వస్తుందని ఆయన పిలుపునిచ్చారు.


