ముంబై: నగరంలో ప్రతి ఏటా వర్షాలకు రోడ్లు చెరువులను తలపించడం అనేది పౌరులు స్వయంగా కొనితెచ్చుకున్న సంక్షోభమేనని బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలు భూములను ఆక్రమించడం, మురుగు కాలువలను పూడ్చివేయడం, ప్రభుత్వ మౌలిక వసతులను దుర్వినియోగం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు పేర్కొంది .
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర వి. ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రజలు మురుగు కాలువలలో చెత్త వేయడం,నడిచే దారులను అక్రమ పార్కింగ్ స్థలాలుగా మార్చడం, ఫుట్పాత్లను ఫుడ్ స్టాళ్లతో ఆక్రమించడం వల్లే ముంబై నగరం మునిగిపోవడానికి కారణమవుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది .
హైకోర్టు వెలుపల ఉన్న ఫుట్పాత్లను సైతం అక్రమ దుకాణాలతో ఆక్రమించేశారని జస్టిస్ ఘుగే ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన మాతృభూమిని మనమే దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. అక్రమంగా భూములను ఆక్రమించుకోవడం, ఆ తర్వాత కూల్చివేత నోటీసులు వచ్చినప్పుడు మాత్రమే చట్ట పుస్తకాలను వెతకడం సరికాదు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


