సర్‌.. హైజాక్‌! | TDP misuse power in special comprehensive revision of voters list | Sakshi
Sakshi News home page

సర్‌.. హైజాక్‌!

Jul 11 2026 3:10 AM | Updated on Jul 11 2026 3:10 AM

TDP misuse power in special comprehensive revision of voters list

నెల్లూరు జిల్లా కొరిమెర్లలో ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను మై టీడీపీ యాప్‌లో నమోదు చేస్తున్న ఆ పార్టీ కార్యకర్త

రాష్ట్రంలో అడుగడుగునా టీడీపీ అధికార దుర్వినియోగం 

ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వాలంటూ అధికారులకు బెదిరింపులు 

టీడీపీ యాప్‌లో నమోదు చేసి ఇస్తామంటూ హుకుం 

అలా ఇవ్వడం కుదరదన్న అధికారులకు వేధింపులు.. పలు చోట్ల ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ‘పచ్చ’ మూక తిష్ట 

సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తున్నా మౌన ముద్రలో ఈసీ.. తంబళ్లపల్లిలో బీఎల్‌వోలను బెదిరించి టీడీపీ యాప్‌లో నమోదు  

నెల్లూరులో మంత్రితో బీఎల్‌ఏల సమావేశానికి హాజరైన మున్సిపల్‌ కమిషనర్‌.. భీమిలిలో ఓటర్లకు బదులు టీడీపీ శ్రేణుల చేతికి రెండో సెట్‌  

అధికార పార్టీ అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ 

4 రోజుల్లో సర్వే ముగియనున్నా స్పందించని ఈసీ.. తప్పిదాలు జరుగుతున్నాయని ఒప్పుకుంటూనే మిన్నకుండిపోయిన వైనం  

సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఇంటింటి సర్వే ముగియనుండటంతో ఎదుటి పార్టీ ఓట్లను తొలగించేలా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర నుంచి మున్సిపల్‌ ఆఫీసుల వరకు ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేరుగా కార్యాలయాల్లో కూర్చొని మరీ ఎన్యూమరేషన్‌ ఫారంలను బీఎల్‌వోల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. 

ఇలా తీసుకున్న ఎన్యూమ­రేషన్‌ ఫారాలను మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకొని తిరిగి ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియోల సాక్షిగా ఈ దురాగతాలు బయట పడు­తున్నా ఎన్నికల సంఘం అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని కూర్చున్నారు. అధికార పార్టీ దుర్వినియోగంపై వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. 

భీమిలిలో తెలుగుదేశం కార్యకర్తలే ఓటర్లు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు నేరుగా సచివాలయంలో దర్జాగా కూర్చొని మరీ ఫారాలు పూర్తి చేస్తున్నారు. బీఎల్‌వోల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలను తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలే ఓటర్లుగా సంతకాలు చేసి ఇచ్చేస్తున్నారు. ఓటర్ల నుంచి సేకరించిన రెండు సెట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలలో ఒక సెట్‌ను బీఎల్‌వోలు ఓటర్లకు ఇవ్వకుండా టీడీపీ నాయకులకు అందిస్తున్నారు. 

ఈ ఫారాలను తెలుగుదేశం కార్యకర్తలు మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకుంటున్నారు. కొన్ని సచివాలయాల్లో అయితే తెలుగుదేశం కార్యకర్తలే బీఎల్‌వో విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి అనేక వీడియోలు వెలుగు చూసినా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి చర్యలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు.

బీజేపీనే తప్పు పడుతోంది
రాష్ట్రంలో జరుగుతున్న ‘సర్‌’ ప్రక్రియను కూటమి పార్టీలే తప్పు పడుతున్నాయి. రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని బీజేపీ రాష్ట్ర శాఖ ఆరోపించడమే కాకుండా నేరుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్, బీజేపీ నేతలు అడ్డూరి శ్రీ రాం, శరణాల మాలతీ రాణి, హేమంత్‌ కుమార్, యాదవ్‌ తదితరులు సీఈవోను కలిశారు. 

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పలువురు బీఎల్‌వోలు ఇంకా ఓటర్లను ప్రత్యక్షంగా కలవలేదని, దీంతో అర్హులైన పలువురు ఓటర్లు ఈ ప్రక్రియకు దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియలో లోపాలను వెంటనే సరిదిద్ది అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా బీజేపీకి చెందిన నేత సర్‌ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడాన్ని తప్పుపట్టారు.

న్యాయ సలహా తీసుకుంటున్నాం : వివేక్‌ యాదవ్‌
రాష్ట్రంలో ‘సర్‌’ ప్రక్రియలో కొంత మంది అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఇప్పటికే పలు ఫిర్యాదులను స్టాండింగ్‌ కమిటీకి స్క్రూట్నీ కోసం పంపామని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

తంబళ్లపల్లిలో బెదిరింపులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు శృతిమించాయి. కనీసం మహిళా ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం చూడకుండా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వాలని మహిళా బీఎల్‌వోను బెదిరించారు. ఇలా ఆమె నుంచి తీసుకున్న ఫారాలను మై టీడీపీ యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఈ సంఘటన వెలుగు చూసి నాలుగు రోజులైనా సంబంధిత వ్యక్తులపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ‘సర్‌’ పక్కదారి పట్టిందనడానికి నిదర్శనంగా నిలిచింది.  

నేరుగా మంత్రి నారాయణే..
టీడీపీ బీఎల్‌ఏలతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన మై టీడీపీ యాప్‌ బాగుందని, దీన్ని వినియోగించుకోవాలని సూచించడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

నరసరావుపేటలో అధికార టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించేలా బీఎల్‌ఓలపై ఒత్తిడి తెస్తున్నారంటూ టీడీపీ బీఎల్‌ఏపై ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోగా, రాజీ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు మూసుకొని అధికార పార్టీకి ఏ విధంగా కొమ్ముకాస్తోందో చెప్పడానికి ఈ సంఘటనలు చాలని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement