దైవాలగూడలో రాక్షసక్రీడ.. ముందే హత్యాచారం! | Six Murders in Three Hours: The Daivalaguda Horror Unfolded | Sakshi
Sakshi News home page

దైవాలగూడలో రాక్షసక్రీడ.. ముందే హత్యాచారం!

Jul 11 2026 9:12 AM | Updated on Jul 11 2026 9:28 AM

Six Murders in Three Hours: The Daivalaguda Horror Unfolded

సాక్షి, రంగారెడ్డి: షాబాద్‌ మండలం దైవాలగూడలో జరిగిన సామూహిక హత్యలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్‌.. ప్రతీకారాన్ని అత్యంత దారుణంగా తీర్చుకున్నాడు. గంటల వ్యవధిలోనే ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యలు జరిగిన తీరు, దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న వివరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. 

పోలీసుల ప్రాథమిక  దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పార్వతి రాజ్‌కుమార్‌ కారులో బాధిత బాలిక(17) ఇంటికి ఓ కారులో చేరుకున్నాడు. ఆ సమయంలో బాలికను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే వారి మాటలను పట్టించుకోకుండా బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామ శివారులోని చెరువు సమీపానికి తీసుకెళ్లాడు.

అక్కడ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్లీ బాలిక ఇంటికే చేరుకున్న రాజ్‌కుమార్‌.. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్లను కత్తితో దాడి చేసి ఇద్దరినీ హతమార్చాడు. అక్కడి నుంచి రాజ్‌కుమార్‌ నేరుగా తన ఇంటికి వెళ్లాడు. 

పిల్లల కోసమంటూ..
ఇంటికి వెళ్లే ముందు భార్య సరితకు ఫోన్‌ చేసి.. "పిల్లలను చూడాలని ఉంది" అని చెప్పాడు. దీంతో ఆమె ఎలాంటి అనుమానం లేకుండా తలుపులు తీసినట్లు సమాచారం. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకునేందుకు సరిత బయటకు పరుగెత్తినా.. వెంబడించి పట్టుకుని మరీ హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఇంట్లో ఉన్న తన మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడినీ వదల్లేదు. ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రలో ఉన్న చిన్నారులు.. అలాగే బెడ్‌ మీద రక్తపు మడుగులో కన్నుమూశారు. పోక్సో కేసు నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను ద్వేషించడం, పిల్లల్ని దగ్గరకు రానివ్వద్దన్న ఉద్దేశంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. నిందితుడు హత్యల సమయంలో శబ్దం బయటకు వెళ్లకుండా అత్యంత వేగంగా, వరుసగా దాడులు చేసినట్లు భావిస్తున్నారు. దీంతో బాధితులకు సహాయం కోరే అవకాశం లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.

ఆరుగురిని హతమార్చిన అనంతరం రాజ్‌కుమార్‌ కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే ముందు తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఆరుగురిని చంపానని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. రాజ్‌కుమార్‌ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికీ నిందితుడు పోలీసులకు చిక్కలేదు.

ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులు
రాజ్‌కుమార్‌ ఏడేళ్ల కిందట.. సరితను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే దైవాలగూడకే చెందిన బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు శంషాబాద్‌లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లే సమయంలోనూ రాజ్‌కుమార్‌ ఆ మెను వెంబడించి.. కలవాలని, మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడట. ఈ బెదిరింపులకు భయపడి బాధితురాల్ని కాలేజీకి పంపడం మానేశారు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువయ్యే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మే 16న పోక్సో కేసు నమోదు కాగా.. మే 26న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే..  కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేసిన పోలీసులు..  కేవలం రూ.20,000 పూచీకత్తుతో బెయిల్‌ మీద బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. రాజ్‌కుమార్‌పై గతంలోనూ ఓ భూవివాదంలో కేసు నమోదైందని తెలుస్తోంది. ఆ కేసులో ఇద్దరిపై దాడి చేశాడని అభియోగం నమోదు అయ్యింది.

ఆ విషయంపై స్పష్టత లేదు: సీపీ జోషి
దైవాలగూడ సామూహిక హత్యలపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి కీలక వివరాలు వెల్లడించారు. హత్యల అనంతరం నిందితుడు రాజ్‌కుమార్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి, తాను కూడా చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదనే అంశంపై కూడా విచారణ జరుగుతోందన్నారు. రాజ్‌కుమార్‌పై పోక్సో కేసుతో పాటు గతంలో మరో కేసు కూడా నమోదైందని ధృవీకరించారు. బాధిత బాలిక తండ్రి మరణంలోనూ రాజ్‌కుమార్‌ పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ జరిపామని, అయితే ఇప్పటివరకు అందుకు ఆధారాలు లభించలేదన్నారు. భార్య, ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రాథమిక విచారణ ప్రకారం ఈ ఆరు హత్యలను రాజ్‌కుమార్‌ ఒక్కడే చేసినట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు.

పోక్సో కేసులో నమోదైన కక్షే ఈ మారణహోమానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడి కదలికలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఈ ఘటనలో పరారీలో ఉన్న రాజ్‌కుమార్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. "ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన ఆ రాక్షసుడు ఎక్కడ?" అన్న ప్రశ్న దైవాలగూడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement