సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ శనివారం ఉదయం షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి నినాదాలు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టలేదని, బాధిత కుటుంబానికి ఎలాంటి భద్రత కల్పించలేదని ఆరోపించారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా అతడి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.

ఆరుగురి హత్యలకు షాబాద్ సీఐ, ఎస్సైల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. రాజ్కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినప్పటికీ.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం, పైగా రెండు నెలల్లోనే అతను బయటకు రావడం చర్చనీయాంశంగా మారాయి. దీంతో పోలీసులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఒకే కుటుంబానికి చెందిన అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో, గ్రామ పెద్దలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి బెయిల్, అనంతర పరిణామాలు, స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై కూడా విచారణ జరిపే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో బాధ్యతను పెంచాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


