ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి.. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించదానికి గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షా డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్తో నడిచే వాహనాలను ఉపయోగిస్తున్న డ్రైవర్లు.. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది డ్రైవర్లపైన కొంత వరకు ఆర్ధిక భారం తగ్గిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద గోవాలో 70 కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ సౌకర్యం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది.
ఇదీ చదవండి: పిల్లల కోసం టెస్లా బైక్.. రూ.20 వేలు మాత్రమే!
అంతేకాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, సోలార్ విద్యుత్, ఇతర స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మరోవైపు.. దాదాపు పదేళ్లుగా సేవలందిస్తున్న గోవా ప్రభుత్వ రవాణా సంస్థ కదంబ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (KTC)కు చెందిన పాత డీజిల్ బస్సులను సీఎన్జీ ఇంజిన్లతో మార్చే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. దీని వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ మరింత పర్యావరణహితంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


