రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచిందా? నల్ల సముద్ర తీరంలోని రష్యా పర్యాటక ప్రాంతం, ఆక్రమిత క్రిమియాపై వరుస డ్రోన్ దాడులతో కీవ్ తన దాడి సామర్థ్యాన్ని మరోసారి చాటుకుందా? తాజాగా జరిగిన ఈ దాడుల్లో 11 మంది మృతి చెందినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి జరిగిన ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని మాస్కో ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై కీవ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
రష్యాలోని క్రాస్నొడార్ ప్రాంతంలోని ఆర్కిపో-ఒసిపోవ్కా సముద్ర తీర రిసార్ట్పై సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులతో కిక్కిరిసిన బీచ్పైకి డ్రోన్ దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో.. సముద్రంలో ఉన్న పర్యాటకులు, తీరంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. డ్రోన్ శకలాలు పడటంతోనే ప్రాణనష్టం జరిగినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు.
🇷🇺🇺🇦 A drone has crashed onto a tourist beach in Gelendzhik, Russia, killing at least 3 and injuring 13.
Gelendzhik is a prominent resort town located on the northeastern coast of the Black Sea, in Russia’s Krasnodar Territory.
The incident occurred during an overnight raid,…— Mario Nawfal (@MarioNawfal) August 3, 2026
ఈ డ్రోన్ను రష్యా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందా? లేదంటే అది నేరుగా బీచ్ను తాకిందా? అనే అంశంపై స్పష్టత లేదు. సమీపంలో ఉన్న రష్యా నౌకాదళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్ దారి తప్పిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
క్రిమియాలో మరో నలుగురు మృతి
మరోవైపు రష్యా ఆధీనంలోని క్రిమియా ప్రాంతంలో జరిగిన మరో డ్రోన్ దాడిలో నలుగురు మృతి చెందినట్లు అక్కడి రష్యా నియమిత గవర్నర్ సెర్గీ అక్స్యోనోవ్ తెలిపారు. నల్ల సముద్ర తీర ప్రాంతాలు వేసవి కాలంలో రష్యా పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాల్లో దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది.
కమాండర్ లక్ష్యంగా.. రెస్టారెంట్లో?
ఇదిలా ఉండగా రష్యా రాజధాని మాస్కోలోని ఓ ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. కుద్రిన్స్కయా స్క్వేర్లోని బాల్సీ రోస్సీ రెస్టారెంట్ వద్ద పేలుడు జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఓ మహిళ పేలుడు పదార్థాలతో రెస్టారెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని.. ఆ సమయంలో బాంబు పేలినట్లు వెల్లడించారు.
తొలుత ఇది ఉగ్రదాడి అని ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపించింది. అయితే కీవ్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ పేలుడు రష్యా ఎయిరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ అలెగ్జాండర్ చైకోను లక్ష్యంగా చేసుకుని జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకల కోసం అదే రెస్టారెంట్లో ఉన్నట్లు కొన్ని రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన నుంచి జనరల్ చైకో సురక్షితంగా బయటపడ్డారు.
ఉక్రెయిన్లోనూ రష్యా దాడులు
మరోవైపు ఉక్రెయిన్లోని జపోరిజ్జియా నగరంపై రష్యా వైమానిక దాడులు జరిపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన బాంబు దాడుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వెల్లడించారు.
ఐదో ఏడాదిలోనూ కొనసాగుతున్న యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించినా.. ముగింపు సంకేతాలు కనిపించడం లేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా, ఉక్రెయిన్ రెండూ చెబుతున్నప్పటికీ.. తాజా ఘటనల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్ర దశకు తీసుకెళ్తాయా?.. అమెరికా అధ్యక్షుడు మరోసారి జోక్యం చేసుకుంటారా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.


