PC: X
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 సీజన్లో భాగంగా సోమవారం ఇండియన్ రాయల్స్, శ్రీలంకన్ లయన్స్ జట్లు తలపడ్డాయి. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్టార్ ఆల్రౌండర్ అసేల గుణరత్నే అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
లోటస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. గుణరత్నే కేవలం 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్లతో 98 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ తిషారా పెరీరా(30 బంతుల్లో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో మన్ప్రీత్ గోనీ రెండు, ఈశ్వర్ పాండే, సుబోధ్ తలా వికెట్ సాధించారు. వీరు ముగ్గురు వికెట్లు సాధించినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
కాపాడిన వరుణుడు
అనంతరం 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ అభిషేక్ జలోటా(0), కరణ్ గుప్తా(8) వికెట్లును భారత్ కోల్పోయింది. దీంతో ఇండియన్ రాయల్స్ జట్టు కేవలం 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్లిష్టసమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ వర్షం కురువడంతో ప్లేయర్లు డగౌట్స్కు పరిగెత్తారు. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఒకవేళ మ్యాచ్కు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగి ఉండంటే భారత జట్టు ఓడిపోయిండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా అంతకముందు మ్యాచ్లో పాకిస్తాన్పై భారత జట్టు ఘన విజయం సాధించింది. మొత్తంగా రెండు విజయాలతో ఇండియన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.


