వరుస వైట్ బాల్ సిరీస్ల అనంతరం టీమిండియా మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ (టెస్ట్ క్రికెట్)లో తలపడేందుకు సిద్ధమైంది. శబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఒకట్రెండు రోజుల్లో శ్రీలంకకు పయనం కానుంది. ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అయితే 'వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్' ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈసిరీస్ చాలా కీలకం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా ఐదవ స్థానంలో ఉంది.
ఈ సైకిల్లో ఇంకా భారత్ ఇంకా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 7 నుంచి 8 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టీమిండియా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. దీంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్లో గిల్ సేన ఎలా రాణిస్తుందో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.
గంభీర్కు మరో అగ్ని పరీక్ష
హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ భారత్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2026 వంటి ఐసీసీ ట్రోఫీలు అందించినప్పటికి.. టెస్టు క్రికెట్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. అతడి హయంలోనే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి జట్ల చేతిలో వరుస సిరీస్లను టీమిండియా కోల్పోయింది.
దీంతో అతడిని కోచ్గా తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం అతడిపై నమ్మకం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గంభీర్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు.
"జట్టు సరిగ్గా రాణించనప్పుడు మేనెజ్మెంట్(కోచ్లు), కెప్టెన్పై ప్రశ్నలు రావడం సహజం. ముఖ్యంగా సొంతగడ్డపై, విదేశీ పర్యటనల్లో సిరీస్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. 2011-12 తర్వాత తొలిసారి న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయాం. అప్పటి నుంచి ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.
వైట్బాల్ క్రికెట్తో పోలిస్తే టెస్టుల్లో మన జట్టు తడబడుతోంది. అయితే ఈ ఒత్తిడి నుంచి ఎలా కోలుకోవాలో గంభీర్ నేతృత్వంలోని టీమిండియాకు తెలుసు. ఏదేమైనప్పటికి శ్రీలంక టూర్లో భారత్కు కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశముందని" దాస్గుప్తా పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో టెస్ట్ల తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
కివీస్ గడ్డపై రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఈ రెండు సిరీస్లో భారత జట్టుకు కచ్చితంగా ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది.


