వాషింగ్టన్ సుందర్ (PC: BCCI X)
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంక పర్యటనలో భారత్కు కచ్చితంగా ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుందని.. ఈ విషయంలో సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించాడు.
కాగా ఆగష్టు 15 నుంచి భారత్- శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచటెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్లో విజయం భారత్కు అతిముఖ్యమైనది. లంకను వైట్వాష్ చేస్తేనే టీమిండియా ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం
ఈ నేపథ్యంలో ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలో టెస్టు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు.. తొలిసారిగా 33 ఏళ్ల సారాంశ్ జైన్కు జాతీయ జట్టులో చోటిచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. అతడి స్థానంలో సారాంశ్ను ఎంపిక చేశారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సారాంశ్ ఎంపిక ఉత్తమమైన నిర్ణయం అని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘శ్రీలంక జట్టులో ప్రస్తుతం ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం టీమిండియాకు ఉంది.
మంచి సెలక్షన్
వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేడు కాబట్టి సారాంశ్ జైన్కు అవకాశం వచ్చింది. నిజానికి సుందర్ కంటే సారాంశ్ బెటర్ బౌలర్. వాషీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడేమోగానీ.. సారాంశ్ మాత్రం అతడి కంటే బౌలింగ్లో మెరుగ్గా రాణించగలడు.
సారాంశ్లో ఆ ప్రతిభ ఉంది. ఇప్పటికైనా అతడిని సెలక్టర్లు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్నేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడు ఓల్డ్ స్కూల్ స్పిన్నర్.
అతడి బౌలింగ్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. అయితే, నిలకడగా బౌలింగ్ చేస్తూ ఒకే చోట బంతులు విసురుతూ బ్యాటర్లను తికమకపెట్టగలడు. రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ మాదిరి నైపుణ్యాలు అతడిలో ఉన్నాయి. కాబట్టి ఇదొక మంచి సెలక్షన్’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.


