గోల్డ్‌ మెడల్స్‌ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’! | Why Pakistan Arshad Nadeem Was Not Allowed Final 3 Throws At CWG 2026 | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ మెడల్స్‌ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’!

Aug 1 2026 2:13 PM | Updated on Aug 1 2026 2:38 PM

Why Pakistan Arshad Nadeem Was Not Allowed Final 3 Throws At CWG 2026

PC: X

పాకిస్తాన్‌ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత అర్షద్‌ నదీమ్‌కు కామన్‌వెల్త్‌ క్రీడలు-2026 చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత ఎడిషన్‌లో స్వర్ణ పతకం గెలిచిన అతడు.. ఈసారి ఫైనల్‌ ఈవెంట్లో కనీసం చివరి మూడు అవకాశాలు ఉపయోగించుకోలేని దుస్థితిలో నిలిచాడు.

ఫైనల్‌కు చేరినా....
కాగా కామన్‌వెల్త్‌ క్రీడల తాజా ఎడిషన్‌లో గురువారం జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ రౌండ్‌ నిర్వహించారు. ఇందులో పద్దెనిమిది మంది పాల్గొనగా అత్యుత్తమంగా ఈటెను ఎక్కువ దూరం విసిరిన టాప్‌-12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. శ్రీలంకకు చెందిన రుమేశ్‌ తరంగ పతిరగే అగ్రస్థానం సంపాదించగా.. భారత అథ్లెట్లు నీరజ్‌ చోప్రా, రోహిత్‌ యాదవ్‌, యశ్‌వీర్‌ సింగ్‌ వరుసగా ఐదు, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.

ఫౌల్‌తో మొదలు.. 
ఇక అర్షద్‌ నదీమ్‌ టాప్‌-7లో చోటు సంపాదించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్‌ ఈవెంట్లో అర్షద్‌కు చేదు అనుభవం ఎదురైంది. తొలి మూడు త్రోలలో భాగంగా అతడు ఫౌల్‌తో ఈవెంట్‌ మొదలుపెట్టాడు.

ఇక రెండో ప్రయత్నంలో 77.41 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్‌.. మూడో ప్రయత్నంలో 75.39 మీటర్లు మాత్రమే విసిరాడు. దీంతో టేబుల్‌లో అతడు తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు. నిబంధనల ప్రకారం.. ఫైనల్‌కు వచ్చిన టాప్‌-12లోని అథ్లెట్ల తొలి మూడు త్రోల ఆధారంగా.. చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జావెలిన్‌ త్రోయర్లు ఎలిమినేట్‌ అవుతారు.

ఎలిమినేట్‌...
దీంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన అర్షద్‌ నదీమ్‌ ఎలిమినేట్‌ అయిపోయాడు. దీంతో పతక వేటలో భాగంగా చివరి మూడు ప్రయత్నాలు చేయకుండానే అతడు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అర్షద్‌ నదీమ్‌ స్వర్ణం గెలిచాడు. నాడు అతడు ఈటెను 85.28 మీటర్ల దూరం విసిరాడు.

ఇక పారిస్‌ ఒలింపిక్స్‌లో అత్యుత్తమంగా రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకం గెలుచుకున్నాడు అర్షద్‌ నదీమ్‌. దీంతో అతడి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అయితే, ఆ తర్వాత అర్షద్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. టోక్యోలో వరల్డ్‌కప్‌ చాంపియన్‌షిప్స్‌ మెడల్‌ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్లు ఈటెను విసిరిన అర్షద్‌ నదీమ్‌.. ఆ తర్వాత కనీసం 80 మీటర్ల మార్కు దాటలేకపోయాడు.

భారత్‌కు రెండు పతకాలు
కామన్‌వెల్త్‌ క్రీడలు-2026 జావెలిన్‌ త్రో విభాగంలో శ్రీలంక స్టార్‌ రుమేశ్‌ పతిరగే 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం గెలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత, భారత స్టార్‌ జావెలిన్‌త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 85.3 మీటర్ల దూరం విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన యశ్‌వీర్‌ 85.41 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ విభాగంలో మూడు పతకాలు సౌత్‌ ఆసియా ప్లేయర్లకే దక్కడం విశేషం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement