స్ఫూర్తి
కోచింగ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన రాజస్థాన్లోని కోటలో ఏ సబ్జెక్ట్కు సంబంధించి అయినా కోచ్లకు కొదవ లేదు. అయితే బాక్సింగ్ కోచ్ దొరకడం మాత్రం చా...లా కష్టం. అలాంటి కష్టం ఉన్నచోట బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టిన అరుంధతి చౌదరి ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజా విషయానికి వస్తే... గ్లాస్గోలోని ఎస్ఇసి సెంటర్లో మహిళల 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది....
మీరు డాక్టర్ కావాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని మీ తల్లిదండ్రులకు బలంగా ఉండొచ్చు. మీకు మరేదో లక్ష్యం ఉండొచ్చు. ‘నా లక్ష్యం ఇది’ అని స్పష్టంగా చెప్పండి. వారు తప్పకుండా ఒప్పుకుంటారు. మీకు బలమైన ఆశీస్సులు అందిస్తారు. అరుంధతి కథ అలాంటిదే.
→ అయినా సరే, ఆటలంటే ఇష్టం
‘విద్యాపరంగా కోటకు ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలుసు. అరుంధతి చదువులో ముందుండేది. గణితంలో అత్యధిక మార్కులు వచ్చేవి. అందుకే ఐఐటీ లేదా ఐఏఎస్ పరీక్ష రాయించాలనుకునేవాడిని. ఆ రెండిటిలో కనీసం ఒకదానిలోనైనా అరుంధతి విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉండేది. అందుకే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాను. అయితే తాను మాత్రం ఆటలు అంటే ఇష్టం అని చెప్పింది’ గతాన్ని గుర్తు చేసుకున్నారు అరుంధతి తండ్రి సురేష్ చౌదరి.
→ రెండు ప్రశ్నలు
ఐఐటీ, ఐఏఎస్ల గురించి చెబుతున్నప్పుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగింది అరుంధతి... ‘ఐఐటీ, ఐఏఎస్ ప్రవేశ పరీక్షలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు?’ ‘ఐఏఎస్లో రెండువందల మంది, ఐఐటీలో పదివేల మంది’ అని చెప్పారు తండ్రి. ‘ఎంతమంది భారతీయులు ఒలింపిక్ స్వర్ణపతకాన్ని గెల్చుకున్నారు?’ అని రెండో ప్రశ్న వేసింది అరుంధతి. ఆయనకు అభినవ్ బింద్రా గురించి మాత్రమే తెలుసు! ఏ ఆటను ఎంచుకోవాలి అనే విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య చాలాసేపు చర్చ నడిచింది.టబాక్సింగ్ అనేది ఒలింపిక్ క్రీడ అని తెలిసినప్పుడు అరుంధతి కళ్లలో మెరుపు కనిపించింది. అలా ఆమె మనసులోకి బాక్సింగ్ ప్రవేశించింది. బాక్సింగ్పై ఇష్టం సరే, మరి కోచ్ ఎవరు?
ఎవరూ లేరు!
చివరికి టైక్వాండో కోచ్ అశోక్ గౌతమ్ ఇంటికి వెళ్లారు. తండ్రీకూతుళ్లు తనకు బాక్సింగ్ గురించి ఏమీ తెలియదని గౌతమ్ చెప్పారు. అయితే ఆయన చేసిన మంచి పని... మహమ్మద్ అలి, మైక్ టైసన్ల గురించి తనకు తెలిసిన విషయాలను అరుంధతికి చెప్పడం. బాక్సింగ్ కోచ్లు అప్లోడ్ చేసిన శిక్షణా వీడియోలను చూసి ఆ విషయాలను అరుంధతికి అర్థమయ్యేలా చెప్పేవారు గౌతమ్.
కట్ చేస్తే...
యూత్ ఆసియా క్రీడల్లో (2019) లో కాంస్యం, సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్(2019)లో స్వర్ణం, యూత్ వరల్డ్ చాంపియన్షిప్స్(2021)లో స్వర్ణం, 2025లో వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలుచుకుంది అరుంధతి. తాజాగా...కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.
‘ఒలింపిక్స్ అంటే ఇంటి పై కప్పులాంటిది. ఒకేసారి పై కప్పుకు చేరుకోలేము. అక్కడికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాలి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేవి ఒలింపిక్ మెట్లలాంటివి’ అంటుంది అరుంధతి. 2028 ఒలిపింక్స్లో పతకం సాధించడం అరుంధతి లక్ష్యం. ఆమె లక్ష్యం సిద్ధించాలని ఆశిద్దాం.
పట్టుదల పెంచేలా...
పోటీలో ఓటమి ఎదురైనప్పుడు, నేను బాధగా కనిపించినప్పుడు అమ్మా,నాన్నలు నాకు ధైర్యం ఇచ్చేవారు. ‘నువ్వు కోల్పోయింది జీవితాన్ని కాదు ఆటను మాత్రమే’ అనేవారు. వారి మాటలు నాకు బలమైన టానిక్లా పనిచేసేవి. ఉత్సాహాన్ని పెంచేవి. ‘ఎలాగైనా ఈసారి గెలవాలి’ అనే పట్టుదలను పెంచేవి.
– అరుంధతి చౌదరి


