breaking news
Glasgow Commonwealth Games
-
వందేమాతరం 2030 వైపు...
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ కమిటీ నుంచి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు... అతడి నుంచి దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు... ఆమె చేతుల మీదుగా గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీకి... ఇలా కామన్వెల్త్ క్రీడల పతాకం 2030 పోటీలు జరిగే అహ్మదాబాద్కు చేరింది. దాంతో అధికారికంగా గ్లాస్గో క్రీడలు ముగిశాయి. పరిమిత సమయంలో, పరిమిత వనరులతోనే కామన్వెల్త్ గేమ్స్కు సిద్ధమైన స్కాట్లాండ్ ప్రభుత్వం సమర్థంగా, ఘనంగా నిర్వహించి ప్రశంసలందుకుంది. పోటీల ప్రధాన స్టేడియం ‘హైడ్రో’లో ముగింపు కార్యక్రమం కూడా అన్ని విధాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ముఖ్యంగా తర్వాతి పోటీల వేదిక అయిన భారత్ గురించి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆసాంతం ఆకట్టుకున్నాడు. ‘వసుధైక కుటుంబం’ థీమ్లో వందేమాతరాన్ని ఆలపించిన సింగర్ శంకర్ మహదేవన్... అయ్ వతన్, సబ్ సే ఆగే హిందూస్తానీ, లహరాదో, భాగ్ మిల్కా భాగ్ వంటి పాటలతో అలరించాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 2026+2030 పోటీల ఆతిథ్య దేశాల సంగీతాలను కలుపుతూ రిషభ్ రికిరామ్ శర్మ, రాస్ ఎయిన్స్లీ ప్రదర్శించిన ‘ఫ్యూజన్’ మరో హైలైట్గా నిలిచింది. స్కాటిష్ సింగర్ స్యాండీ థామ్, ఆ్రస్టేలియా గాయని డెల్టా గూడ్రెమ్ పాడిన పాటలు, స్కాటిష్ స్టెప్ డాన్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపగా, ఈ పోటీల్లో ఆటగాళ్ల ప్రదర్శనతో రూపొందించిన ‘స్పోర్ట్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్’ ఏవీ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. గ్లాస్గో చైర్మన్ జార్జ్ బ్లాక్, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ సందేశంతో కార్యక్రమం ముగిసింది. 74 దేశాలకు చెందిన అథ్లెట్లు ముగింపు కార్యక్రమంలో పాల్గొనగా... భారత్ నుంచి బాక్సర్ జైస్మీ¯Œ జాతీయ పతాకంతో ముందు నడిచింది. ‘ఘనంగా నిర్వహిస్తాం’ 2030 కామన్వెల్త్ గేమ్స్పై గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీగ్లాస్గో: రెండు దశాబ్దాల తర్వాత భారత్ మరోసారి కామన్వెల్త్ క్రీడలకు వేదిక అవుతోంది. 2030లో జరిగే పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పోటీలు జరుగుతాయి. గ్లాస్గో ముగింపు వేడుకల్లో సీడబ్ల్యూజీ నిర్వాహకులు సంప్రదాయ రీతిలో పోటీల జెండాను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి హర్ష్ సంఘ్వీకి అందజేశారు. ఈ నేపథ్యంలో గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆయన పలు అంశాలు మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఘనంగా, అత్యుత్తమంగా పోటీలను నిర్వహిస్తామని హర్ష్ సంఘ్వీ చెప్పారు. 2010లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ భారత్లోని ఢిల్లీ నగరంలో జరిగాయి. ‘కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఇప్పటికే అహ్మదాబాద్లో అందుబాటులో ఉన్నాయి. 20 శాతం వసతులను మెరుగు పరిస్తే చాలు. క్రీడాభివృద్ధిలో భాగంగా మేం చేస్తున్న పనులు 2028 చివర్లో పూర్తవుతాయి. కొత్తగా నిర్మించే స్టేడియంలను యువ అథ్లెట్ల శిక్షణ, హాస్టల్ వసతి కోసం వినియోగిస్తాం. ఇప్పటికిప్పుడు గేమ్స్ నిర్వహించగల హోటల్ వసతి, రవాణా సౌకర్యాలు మా వద్ద ఉన్నాయి. గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు’ అని సంఘ్వీ వివరించారు. -
బంగారు కోటలో అరుంధతి
కోచింగ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన రాజస్థాన్లోని కోటలో ఏ సబ్జెక్ట్కు సంబంధించి అయినా కోచ్లకు కొదవ లేదు. అయితే బాక్సింగ్ కోచ్ దొరకడం మాత్రం చా...లా కష్టం. అలాంటి కష్టం ఉన్నచోట బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టిన అరుంధతి చౌదరి ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజా విషయానికి వస్తే... గ్లాస్గోలోని ఎస్ఇసి సెంటర్లో మహిళల 70 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది....మీరు డాక్టర్ కావాలి లేదా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని మీ తల్లిదండ్రులకు బలంగా ఉండొచ్చు. మీకు మరేదో లక్ష్యం ఉండొచ్చు. ‘నా లక్ష్యం ఇది’ అని స్పష్టంగా చెప్పండి. వారు తప్పకుండా ఒప్పుకుంటారు. మీకు బలమైన ఆశీస్సులు అందిస్తారు. అరుంధతి కథ అలాంటిదే.→ అయినా సరే, ఆటలంటే ఇష్టం‘విద్యాపరంగా కోటకు ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలుసు. అరుంధతి చదువులో ముందుండేది. గణితంలో అత్యధిక మార్కులు వచ్చేవి. అందుకే ఐఐటీ లేదా ఐఏఎస్ పరీక్ష రాయించాలనుకునేవాడిని. ఆ రెండిటిలో కనీసం ఒకదానిలోనైనా అరుంధతి విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉండేది. అందుకే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాను. అయితే తాను మాత్రం ఆటలు అంటే ఇష్టం అని చెప్పింది’ గతాన్ని గుర్తు చేసుకున్నారు అరుంధతి తండ్రి సురేష్ చౌదరి.→ రెండు ప్రశ్నలుఐఐటీ, ఐఏఎస్ల గురించి చెబుతున్నప్పుడు తండ్రిని ఒక ప్రశ్న అడిగింది అరుంధతి... ‘ఐఐటీ, ఐఏఎస్ ప్రవేశ పరీక్షలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు?’ ‘ఐఏఎస్లో రెండువందల మంది, ఐఐటీలో పదివేల మంది’ అని చెప్పారు తండ్రి. ‘ఎంతమంది భారతీయులు ఒలింపిక్ స్వర్ణపతకాన్ని గెల్చుకున్నారు?’ అని రెండో ప్రశ్న వేసింది అరుంధతి. ఆయనకు అభినవ్ బింద్రా గురించి మాత్రమే తెలుసు! ఏ ఆటను ఎంచుకోవాలి అనే విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య చాలాసేపు చర్చ నడిచింది.టబాక్సింగ్ అనేది ఒలింపిక్ క్రీడ అని తెలిసినప్పుడు అరుంధతి కళ్లలో మెరుపు కనిపించింది. అలా ఆమె మనసులోకి బాక్సింగ్ ప్రవేశించింది. బాక్సింగ్పై ఇష్టం సరే, మరి కోచ్ ఎవరు?ఎవరూ లేరు!చివరికి టైక్వాండో కోచ్ అశోక్ గౌతమ్ ఇంటికి వెళ్లారు. తండ్రీకూతుళ్లు తనకు బాక్సింగ్ గురించి ఏమీ తెలియదని గౌతమ్ చెప్పారు. అయితే ఆయన చేసిన మంచి పని... మహమ్మద్ అలి, మైక్ టైసన్ల గురించి తనకు తెలిసిన విషయాలను అరుంధతికి చెప్పడం. బాక్సింగ్ కోచ్లు అప్లోడ్ చేసిన శిక్షణా వీడియోలను చూసి ఆ విషయాలను అరుంధతికి అర్థమయ్యేలా చెప్పేవారు గౌతమ్.కట్ చేస్తే...యూత్ ఆసియా క్రీడల్లో (2019) లో కాంస్యం, సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్(2019)లో స్వర్ణం, యూత్ వరల్డ్ చాంపియన్షిప్స్(2021)లో స్వర్ణం, 2025లో వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలుచుకుంది అరుంధతి. తాజాగా...కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.‘ఒలింపిక్స్ అంటే ఇంటి పై కప్పులాంటిది. ఒకేసారి పై కప్పుకు చేరుకోలేము. అక్కడికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాలి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేవి ఒలింపిక్ మెట్లలాంటివి’ అంటుంది అరుంధతి. 2028 ఒలిపింక్స్లో పతకం సాధించడం అరుంధతి లక్ష్యం. ఆమె లక్ష్యం సిద్ధించాలని ఆశిద్దాం. పట్టుదల పెంచేలా...పోటీలో ఓటమి ఎదురైనప్పుడు, నేను బాధగా కనిపించినప్పుడు అమ్మా,నాన్నలు నాకు ధైర్యం ఇచ్చేవారు. ‘నువ్వు కోల్పోయింది జీవితాన్ని కాదు ఆటను మాత్రమే’ అనేవారు. వారి మాటలు నాకు బలమైన టానిక్లా పనిచేసేవి. ఉత్సాహాన్ని పెంచేవి. ‘ఎలాగైనా ఈసారి గెలవాలి’ అనే పట్టుదలను పెంచేవి.– అరుంధతి చౌదరి -
నాన్నా... నీ కల ఇది...
త్రిపురలోని సైకిల్ మెకానిక్ కుమార్తె అస్మితా డే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో చరిత్ర లిఖించింది. 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి కామన్వెల్త్ జూడోలో దేశానికి తొలి గోల్డ్మెడల్ అందించింది. మెడలో మెరుస్తున్న పతకాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి ‘నాన్నా... ఇది నీ కల’ అన్నప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది కళ్లు చెమర్చాయి. ఆమెను ప్రోత్సహించిన తండ్రి కొద్ది నెలల కిందే మరణించాడు. కాని బిడ్డ ఆయన కలను సాకారం చేసింది.గ్లాస్గో, జూలై 31ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. మ్యాట్పై ఇద్దరు జూడో యోధులు తలపడుతున్నారు. ఒకరు కెనడాకు చెందిన అంతర్జాతీయ ఛాంపియన్ హెడీ క్వాచ్, మరొకరు మన త్రిపుర మట్టిలో పెరిగిన నిరుపేద సైకిల్ మెకానిక్ కూతురు, 23 ఏళ్ల అస్మితా డే. అస్మితా కళ్లలో అలసట లేదు. కేవలం గెలవాలనే కసి, తండ్రికి ఇచ్చిన మాట మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపులాంటి పట్టు... ప్రత్యర్థి చిత్తయింది! అంపైర్ అస్మితా చేయి పైకెత్తగానే స్టేడియం భారత జయజయధ్వానాలతో మారుమోగిపోయింది. కానీ, అస్మితా మాత్రం మోకాళ్లపై కూలబడి, రెండు చేతులతో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో గెలిచిన ఆనందం కంటే, ఈ విజయాన్ని చూడడానికి నాన్న లేడనే దు:ఖమే ఎక్కువగా ఉంది.తండ్రి కలత్రిపురలోని బెలోనియా అనే చిన్న పట్టణంలో నివసించే అస్మితా డే కుటుంబం కూటికి పేదదేమో కాని కలలకు కాదు. ఆమె తండ్రి అర్జున్ కుమార్ డే చిన్న సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ రోజుకు 300 సంపాదించేవాడు. అయినా సరే కుమార్తెను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా చూడాలని కలలు కనేవాడు. అస్మితాకు జూడో ఆటను పరిచయం చేసి, లక్ష రూపాయల అప్పు చేసి మరీ జూడో సెంటర్లో చేర్పించాడు. ‘మా అమ్మాయి దేశం మెచ్చే స్థాయికి ఎదగాలి‘ అనేదే ఆ తండ్రి ఆరాటం. కానీ, కూతురు సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని చూడకుండానే డిసెంబర్, 2025లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కన్నుమూశాడు. ఆ సమయంలో అస్మితా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, తన ప్రపంచమంతా ముగిసిపోయిందని భావించింది. కాని పదిరోజుల్లోనే తల్లి కుమార్తెను లక్ష్యం వైపు ఉత్తేజపరిచింది. ‘నువ్వు ఆగిపోతే మీ నాన్నను అగౌరవపరిచినట్టే’ అని శిక్షణకు పంపింది.కోచ్ల అండకన్నతండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అస్మితాను త్రిపుర స్పోర్ట్స్ స్కూల్ కోచ్లు, జూడో అసోసియేషన్ సెక్రటరీ ప్రణబ్ సాహా ఎంతో అండగా నిలిచి మళ్ళీ మ్యాట్ మీదకు తీసుకువచ్చారు. అస్మితాలోని ప్రతిభను మొదట గుర్తించిన బీనా దేబ్నాథ్, మణికలాల్ దేబ్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఊరి నుంచి రావడానికి బస్సు చార్జీలు లేని రోజుల్లో తమ సొంత డబ్బులతో సహాయం చేశారు. ఆమె భోజన వసతి కోసం కోచ్లు అందరూ కలిసి డబ్బులు పూల్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత భోపాల్లోని సాయ్ ( అఐ) రీజినల్ సెంటర్లో కోచ్ యశ్పాల్ సోలంకి పర్యవేక్షణలో ఆమె మరింత రాటుదేలింది. గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఆసియా కప్, ఆఫ్రికన్ ఓపెన్ లలో పతకాలు సాధిస్తూ తన పట్టుదలని నిరూపించుకోవడంతో రెండేళ్ల క్రితం యుపి పోలీస్ ఆమెకు ఎస్.ఐ. పోస్టు ఇచ్చింది. అయినా సరే తన శిక్షణకు, ఇల్లు గడవడానికి ఆ జీతం అంతంత మాత్రమే.లక్ష్యం అదేఇప్పుడు అస్మితా లక్ష్యం ఒక్కటే. నాన్న పేరుతో బెలోనియాలో ఒక జూడో అకాడమీ పెట్టడం. ‘నాలా ఇంకా చాలా మంది పేద పిల్లలు ఉన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వాలి’ అని చెబుతోంది అస్మితా. కూతురు సాధించిన విజయం చూసి ‘నా భర్త బ్రతికి ఉండి ఈ విజయాన్ని చూసుంటే ఎంత సంతోషించేవారో!’ అంటూ అస్మితా తల్లి కన్నీరుమున్నీరయ్యింది. అస్మితా సాధించిన విజయం కేవలం ఒక పతకం మాత్రమే కాదు. పేదరికంపై, విధిపై ఒక సామాన్య భారతీయురాలు సాధించిన అసాధారణ విజయం. ఆకాశం వైపు చూస్తూ తన తండ్రికి ఆమె సమర్పించిన ఈ సువర్ణ నివాళి ఎప్పటికీ అమరమే. గ్లాస్గో మ్యాట్పై సింహగర్జనఎలాగైనా స్వర్ణం గెలవాలనే పట్టుదలతో గ్లాస్గో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కెనడాకు చెందిన బలమైన ప్రత్యర్థి హెడీ క్వాచ్తో అస్మితా తలపడింది. మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి ఆధిక్యం సాధించినప్పటికీ, అస్మితా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తన తండ్రి ఆశయాలను, పడ్డ కష్టాలను గుండెల్లో నింపుకుని సింహంలా పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ‘గోల్డెన్ స్కోర్’ రౌండ్లో అద్భుతమైన పట్టుతో ప్రత్యర్థిని మట్టికరిపించి చారిత్రాత్మక ‘గోల్డ్’ కైవసం చేసుకుంది. మెడలో బంగారు పతకం పడుతుంటే, పోడియంపై నిలబడి జాతీయగీతం వింటున్నప్పుడు అస్మితా కళ్ల నుంచి ఆనంద బాష్పాలు ధారలుగా ప్రవహించాయి. -
కామన్వెల్త్లో బంగారు పంట.. ఒక్కరోజే ఆరు స్వర్ణాలు కైవసం
కామన్ వెల్త్ గేమ్స్లో భారత్ దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ఆరు బంగారు పతకాలు బాక్సింగ్లోనే రావడం మరో విశేషం. ఈ మెడల్స్తో పతకాల పట్టికలో భారత్ ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి పసిడి పతకాలు నెగ్గారు.తాజాగా ఈ లిస్ట్లో సచిన్ సివాచ్ కూడా చేరారు. పురుషుల 60 కేజీల విభాగంలో పోటీపడిన సచిన్ సివాచ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ బౌట్లో ఆస్ట్రేలియా బాక్సర్ను చిత్తు చేశాడు. ఈ పతకంతో ఇండియా మెడల్స్ సంఖ్య ఓవరాల్గా 36కు చేరుకుంది. దీంతో ప్రస్తుతం పతకాల పట్టికలో ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
కామన్వెల్త్ గేమ్స్.. నీరజ్ చోప్రాకు రజతం
కామన్వెల్త్ గేమ్స్లో భారత జావెలిన్ త్రోయర్స్ సత్తా చాటారు. ఒలింపిక్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా (85.83 మీటర్లు) మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్లో నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు. ఈ ఫైనల్లో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే 89.75 మీటర్లు విసిరి అగ్రస్థానంతో పాటు స్వర్ణం కైవసం చేసుకున్నాడు.ఇదే ఫైనల్లో మన దేశానికే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ (85.41 మీ) విసిరి మూడోస్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో కాంస్యం పతకం దక్కించుకున్నారు. యశ్వీర్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇండియాకే చెందిన మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్(81.56 మీటర్లు) ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ప్రదర్శనతో కామన్ వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 23కు చేరుకుంది. -
తన బరువుతోనే అసలు యుద్ధం
కామన్వెల్త్... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్ గోల్డ్మెడల్ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక అదృశ్య పోరాటం ఉంది. అది తానెత్తే బరువులతో కాదు... తన బరువుతో. పన్నెండేళ్లుగా మీరాబాయి 48 కిలోల బరువునే మెయింటైన్ చేస్తోంది. 2014లో గ్లాస్గోలో ఏ బరువుతో కామన్వెల్త్లో మొదటిసారి పాల్గొందో, 2026లో గ్లాస్గోలో కూడా అదే బరువుతో పాల్గొని మూడో బంగారం తెచ్చింది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సహజం. కానీ మీరా మాత్రం ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. ఆమె ఫిట్నెస్ రహస్యం ఏమిటి?‘వెయిట్లిఫ్టర్లం అనగానే అందరూ మేము విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. కానీ అది తప్పు, మేం చాలా తక్కువ తింటాం. బ్రెడ్, పాలు కూడా ముట్టలేము. ప్రతి గ్రాముకూ లెక్క ఉంటుంది’ అంటుంది మీరాబాయి చాను. బరువులెత్తడంలో ప్రపంచ విజేతగా నిలుస్తున్న మీరాబాయి తన బరువు విషయంలో కూడా అంతే విజేత. ‘బరువు తగ్గడం సాధ్యం కావడం లేదు’ అనేవారికి మీరాబాయి 12 ఏళ్లుగా స్థిరంగా మెయిన్టెయిన్ చేస్తున్న బరువు తప్పక స్ఫూర్తి కలిగించవచ్చు.ఆమె విజయం సులభం కాదుప్రపంచ వేదికల మీద పతకాలు సాధిస్తున్న మీరాబాయి జీవితం మనకు కనిపించేంత గ్లామరస్ కాదు. ‘ట్రైనింగ్లో పిచ్చిగా కష్టపడాలి. లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం’ అంటుందామె. సాధన ఒకటే కాదు గాయాలూ వెంటాడుతాయి. 2023లో తొడ గాయం. ఈ ఏడాది భుజం నొప్పి. పారిస్ ఒలింపిక్స్లో మహిళలకు సహజంగా వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్తో బాధ పడుతూనే పోటీ రోజు వేదిక ఎక్కింది. గ్లాస్గో పోటీకి కొన్ని రోజుల ముందు శిక్షణలో చిన్న గాయం. అయినా సాధన ఆపలేదు. కోచ్ విజయ్శర్మతో ఉదయం 5 గంటల నుండి బరువు ఎత్తే సాంకేతికతను వేలాదిసార్లు ప్రాక్టీస్ చేయడం. ఒక మిల్లీమీటర్ తేడా వచ్చినా పతకం జారిపోతుందని ఆమెకు తెలుసు.చిన్నప్పటి నుంచి కష్టాలుమణిపూర్లోని నోంగ్పోక్ కచింగ్ గ్రామం మీరాబాయిది. పేద కుటుంబం. మీరాకు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. తండ్రి రోజు కూలీ. తల్లి చిన్న టీ కొట్టు నడిపేది. చదువు 12వ తరగతితో ఆగిపోయింది. కానీ ఆమెకు బలం ఉండేది. ఆరేళ్ల వయసులో అన్నయ్య మోయలేని కట్టెల మోపును తనే మోసేది. ఇంట్లో బియ్యం బస్తాలు, నీళ్ల కుండలు లేవనెత్తేది. ‘ఈ పిల్లకు చేతుల్లో బలం ఉంది’ అని ఒక కోచ్ గుర్తించాడు. పన్నెండేళ్లకే ఇంటి నుండి ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఇంఫాల్ స్టేడియానికి ప్రాక్టీసుకు వెళ్లేది. అమ్మ నగలు అమ్మి, అన్నయ్య జీతం నుండి డబ్బులు ఇచ్చి పోటీలకు పంపారు. 2016 రియో ఒలింపిక్స్లో విఫలమైనప్పుడు దేశమంతా విమర్శించింది. కానీ, ఆ విమర్శలనే ఇంధనంగా మార్చుకుని 2017లో ప్రపంచ ఛాంపియన్ గా, 2020 టోక్యోలో ఒలింపిక్ రజత విజేతగా నిలిచింది. ఈరోజు ఆమె ధరించే చెవిపోగులు రియోకు ముందు అమ్మ చేయించినవే. ‘అవి నాకు అదృష్టాన్ని తెస్తాయి’ అంటుంది.ముగింపుమీరాబాయి చాను మనకు నేర్పింది ఒకటే. బరువు తగ్గడం అంటే అందం కోసం కాదు. ఆత్మగౌరవం కోసం. ఆరోగ్యం కోసం. లక్ష్యం కోసం. శరీరం బరువు 48 కేజీలైనా ఆమె మనసు 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తోంది.‘నా శరీరం నా ఆలయం. దాన్ని బలంగా ఉంచుకోవడం నా బాధ్యత’ అంటుంది మీరాబాయి చాను. ఈ మాట ఒక్కటి చాలు. మనం కూడా మన శరీరాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి. ఆహార నియమాలుఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. 48 కిలోల క్రీడాకారిణిగా ఉండాలంటే ప్రతి గ్రామూ లెక్కే. పండగ భోజనం, జిలేబి ముక్క కూడా బరువు పెంచేస్తుంది. పోటీకి ముందు రోజులలో నీళ్లు కూడా తక్కువ తాగుతుంది. చెమట పట్టించి, సౌనా బాత్లో కూర్చుని ఆవిరితో ఒక్కో గ్రాము తగ్గిస్తుంది. మీరాబాయి ఫిట్నెస్కు 3 స్తంభాలు ఉన్నాయి. ఆహారం, సాధన, మానసిక బలం.1. ఆహారంఉదయం: గోరువెచ్చని నీళ్లు, తేనె, గుడ్డు తెల్లసొన, ఓట్స్, పండ్లు.మధ్యాహ్నం: ఉడికించిన చికెన్ లేదా చేప, గోధుమ రొట్టెలు, పెద్ద సలాడ్.సాయంత్రం: పాలు, బాదం, ప్రోటీన్ పానీయం.రాత్రి: సూప్, ఉడికించిన కూరగాయలు, పప్పు.నూనె, తీపి, వేయించిన పదార్థాలకు దూరం. రోజుకు 4 నుండి 5 లీటర్ల నీళ్లు. ఆకలి వేసినా నీళ్లు తాగి కంట్రోల్ చేస్తుంది.2. సాధనఉదయం: జిమ్లో సాంకేతిక సాధన. బరువు ఎత్తడం, పట్టు.మధ్యాహ్నం: కార్డియో, పరుగు, సైక్లింగ్, తాడు దూకడం. సాయంత్రం: యోగా, స్ట్రెచింగ్. గాయాలు రాకుండా శరీరాన్ని సాగదీయడం.ఒక్కరోజు కూడా సెలవు లేదు. ‘నా క్లాస్రూమ్ జిమ్’ అంటుంది.3. మానసిక బలం‘నా కళ్ల ముందు ఎప్పుడూ దేశ జెండా ఉంటుంది’ అంటుంది మీరా. గ్లాస్గోలో మొదటి ప్రయత్నం విఫలమైనా ఆందోళన చెందకుండా, స్మైల్ ఇస్తూ తర్వాతి రౌండ్లో రికార్డు కొట్టడం ఆమె మానసిక బలానికి నిదర్శనం. -
భారత టీటీ జట్ల శుభారంభం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో ఆతిథ్య భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. భారత పురుషుల జట్టు 3–0తో జింబాబ్వే జట్టుపై... భారత మహిళల జట్టు 3–0తో మాల్దీవులు జట్టుపై విజయం సాధించాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత నంబర్వన్ మానవ్ ఠక్కర్ 11–3, 11–2, 11–6తో తయెందా ముమ్వుమాపై, హర్మిత్ దేశాయ్ 11–5, 11–4, 11–5తో తపివా ముసరువాపై, పాయస్ జైన్ 11–3, 11–3, 11–8తో విక్రమ్ సింగ్పై గెలిచారు. భారత మహిళల జట్టు తరఫున సుతీర్థ ముఖర్జీ, యశస్విని, స్వస్తిక విజయం అందుకున్నారు. సుతీర్థ 11–4, 11–2, 11–5తో ఫతీమత్ ధీమా అలీపై, యశస్విని 11–2, 11–5, 11–7తో ఐశాత్ రఫా నాజిమ్పై, స్వస్తిక 11–3, 11–5, 11–2తో మిష్కా ఇబ్రహీంపై గెలుపొందారు. ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న కామన్వెల్త్ టీటీ చాంపియన్షిప్లో పురుషుల, మహిళల టీమ్ విభాగాలతోపాటు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో భారత క్రీడాకారులే డిఫెండింగ్ చాంపియన్స్గా ఉండటం విశేషం. -
కబడ్డీ నుంచి వెయిట్లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్షిప్లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్షిప్లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్గా 199 కేజీలు (స్నాచ్లో 87 + క్లీన్ అండ్ జర్క్లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్లిఫ్టింగ్పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్హామ్లోని వార్లీ వెయిట్లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్జంప్లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్గా 28వ స్థానంలో నిలిచాడు. -
తెలంగాణ నుంచి ఒకరు... ఆంధ్ర నుంచి ఒకరు
కామన్వెల్త్ గేమ్స్కు అథ్లెట్ల ఎంపిక సాక్షి, హైదరాబాద్: గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అథ్లెట్లకు అవకాశం దక్కింది. తెలంగాణకు చెందిన మొహమ్మద్ బాబా, ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికందన్రాజ్ సీడబ్ల్యూజీ-2014కు ఎంపికయ్యారు. హైదరాబాద్లోనే పోలీస్ విభాగంలో బాబా విధులు నిర్వర్తిస్తుండగా... మణికందన్ రాజ్ ఎస్సీ రైల్వే (విజయవాడ)లో పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో చూపిన ప్రదర్శన కారణంగా వీరిద్దరు అర్హత సాధించారు. ఈ ఇద్దరు అథ్లెట్లు బెంగళూరులో జరుగుతున్న భారత జట్టు శిక్షణ శిబిరంలో చేరారు. జులై 23నుంచి ఆగస్ట్ 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కామన్వెల్త్ పోటీలు జరగనున్నాయి.


