పర్యటన- దేశ సరిహద్దులు
కొన్ని పర్యటనలు కేవలం కొత్త ప్రదేశాలను మాత్రమే చూపించవు. మన దేశం ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత వైవిధ్యంగా ఉంటుందో కొత్త కోణంలో పరిచయం చేస్తాయి. భారతదేశ సరిహద్దుల్లో ఉన్న ఈ 5 యాత్రలు అలాంటి అనుభూతినే అందిస్తాయి. భారత దేశం కేవలం మ్యాపులో గీసిన గీతల సమాహారం కాదు. హిమాలయాల మంచు శిఖరాల నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు, పంజాబ్ పచ్చని పొలాల నుంచి గుజరాత్ ఉప్పు మైదానాల వరకు ప్రతి సరిహద్దు, ప్రతి చివరి గ్రామం భారత వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వారం మన యాత్ర అలాంటి 5 అద్భుతమైన సరిహద్దు పర్యాటక ప్రాంతాల వైపుగా సాగుతుంది..
తవాంగ్ నుంచి బూమ్లా పాస్ వైపు
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ నుంచి బూమ్లా పాస్ వైపు ప్రయాణిస్తుంటే ప్రతి మలుపు ఒక చిత్రకారుడి కాన్వాస్లా కనిపిస్తుంది. మేఘాలు రహదారిపై నడుస్తున్నట్టుగా, దూరంలో మంచు శిఖరాలు మెరిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరిహద్దు ప్రకృతి అందం, దేశభక్తి రెండింటినీ ఒకే చోట పరిచయం చేస్తుంది. మధ్యలో కనిపించే సాంగెత్సర్ సరస్సు, సేలా పాస్ అందాలు, తవాంగ్ మఠం ప్రశాంతత ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. టిబెటన్ సంస్కృతి ప్రభావం ఉన్న చిన్న హోటళ్లలో బస చేయడం, చల్లని వాతావరణంలో తూక్పా, మోమోలు, వెన్న టీ రుచులు ఆస్వాదించడం, హిమాలయ రహదారులపై ప్రయాణించడం, ప్రకృతి నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఇక్కడ మరిచిపోలేని అనుభవాలుగా మిగిలిపోతాయి.
గమనిక: అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలంటే ముందుగా ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. బూమ్లా పాస్ సందర్శించాలంటే స్థానిక డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
వాఘా సరిహద్దు
పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని వాఘా సరిహద్దులో సాయంత్రం సమయం రాగానే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సూర్యాస్తమయ వేళ భారత్, పాకిస్తాన్ సరిహద్దు ఒక గొప్ప వేదికగా మారుతుంది. సరిహద్దు భద్రతా దళాల పరేడ్, జాతీయ గీతాలు, వేలాది మంది సందర్శకుల హర్షధ్వానాలు కలిసి దేశభక్తిని ఉప్పొంగించే క్షణాలను సష్టిస్తాయి. అమత్సర్ చేరిన తర్వాత రహదారి ప్రయాణంలో పంజాబ్ పచ్చని పొలాలు స్వాగతం పలుకుతాయి. వారసత్వ హోటళ్లలో బస, పంజాబీ ఆతిథ్యం, అమృత్సరి కుల్చా, లస్సీ, సర్సోన్ కా సాగ్ వంటి స్థానిక వంటకాల రుచులు ఈ యాత్రలో భాగమవుతాయి. స్వర్ణ దేవాలయ ప్రశాంతత, వాఘా సరిహద్దు వేడుకల ఉత్సాహం, స్థానిక బజార్ల సందడి కలిసి ఈ ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి.
నాథులా పాస్
సిక్కింలోని గ్యాంగ్టక్ నుంచి నాథులా పాస్ వైపు ప్రయాణిస్తుంటే మేఘాలు రహదారిని ఆలింగనం చేసినట్టుగా కనిపిస్తాయి. ఒకప్పుడు ప్రాచీన సిల్క్ రూట్లో భాగమైన ఈ మార్గం నేడు ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలుస్తోంది. దారి మధ్యలోని త్సోంగో సరస్సు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ అలరిస్తుంది. బాబా హర్భజన్ సింగ్ ఆలయం వద్ద ఆగినప్పుడు స్థానిక కథలు, సైనికుల త్యాగాలు మనసును తాకుతాయి. పర్వత ప్రాంత లాడ్జ్లలో బస, వేడి మోమోలు, నూడిల్స్ సూప్, స్థానిక టీ రుచులు చల్లని గాలితో కలిసి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. సరస్సుల ఒడ్డున సమయం గడపడం, హిమాలయాలను ఆస్వాదించడం, స్థానిక సంస్కతిని దగ్గరగా చూడడం, మేఘాల మధ్య ఫోటోగ్రఫీ చేయడం ఈ యాత్రను చిరస్మరణీయంగా మారుస్తాయి.
లాంగేవాలా
రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి లాంగేవాలా వైపు ప్రయాణం మొదలైతే భూమి రంగులు నెమ్మదిగా మారడం కనిపిస్తుంది. బంగారు ఇసుక దిబ్బలు, విశాలమైన ఆకాశం, నిశ్శబ్దంగా నిలిచిన యుద్ధ జ్ఞాపకాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. లాంగేవాలా యుద్ధ స్మారకం వద్ద చరిత్ర మౌనంగా మాట్లాడుతుంది. ఎడారి శిబిరాల్లో బస చేయడం, రాజస్థానీ ఆతిథ్యాన్ని ఆస్వాదించడం, దాల్ బాటీ చూర్మా, కేర్ సంగ్రీ వంటి స్థానిక వంటకాలను రుచి చూడడం యాత్రను మరింత సంపూర్ణంగా మారుస్తాయి. ఒంటెల సఫారీ, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఎడారి గాలి, చరిత్ర కలిసి ఇక్కడ మరిచిపోలేని అనుభూతులను అందిస్తాయి.
గ్రేట్ రాన్ ఆఫ్ కచ్
గుజరాత్లోని గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ చేరగానే తెల్లని ఉప్పు మైదానాలు అనంతంగా విస్తరించి కనిపిస్తాయి. సూర్యకాంతి ఆ తెల్లని నేలపై ప్రతిబింబిస్తూ మరో ప్రపంచంలోకి వచ్చిన అనుభూతిని కలిగిస్తుంది. భుజ్ నుంచి ప్రారంభమయ్యే ప్రయాణంలో కచ్చీ సంస్కతి ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. తెల్లని ఎడారి మధ్య శిబిరాల్లో బస చేయడం, కచ్చీ ఎంబ్రాయిడరీ కళను చూడడం, జానపద సంగీతాన్ని ఆస్వాదించడం, డాబెలి, కచ్చీ భోజనాల రుచులు చూడడం ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. కాలో డుంగర్ నుంచి విశాలమైన రాన్ను వీక్షించడం, సాయంత్రం ఆకాశంలో మారే రంగులను చూడడం ఈ యాత్రను మరింత అందంగా నిలబెడుతుంది.
యాత్రా బడ్జెట్ వివరాలు
⇒ హైదరాబాద్ నుంచి ఈ సరిహద్దు పర్యాటక ప్రాంతాల్లో ఏదైనా ఒకటి ఎంచుకుని ఐదు రోజుల ప్రయాణం ప్లాన్ చేస్తే సాధారణ బడ్జెట్లో సుమారు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు ఖర్చవుతుంది. సౌకర్యవంతమైన ప్రయాణానికి రూ.50,000 నుంచి రూ.70,000 వరకు, ప్రీమియం అనుభవానికి రూ.80,000 నుంచి రూ.1,10,000 వరకు వ్యయం కావచ్చు.
చదవండి: వర్షంలో రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా?
⇒ విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా అనుసంధాన విమానాల ద్వారా ఈ ప్రాంతాలకు చేరుకోవచ్చు. వసతి సౌకర్యాలు రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.7,000 వరకు లభిస్తాయి. ఆహారం కోసం రోజుకు రూ.700 నుంచి రూ.1,500 వరకు కేటాయిస్తే సరిపోతుంది. స్థానిక దర్శనాల కోసం భాగస్వామ్య వాహనాలు, ప్రైవేట్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతాలన్నీ భారతదేశంలోనే ఉన్నందున వీసా అవసరం లేదు.
ఆసక్తికరమైన విషయాలు
బూమ్లా పాస్ భారత్, చైనా సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్లో ఉంది.
వాఘా సరిహద్దులో ప్రతి సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
నాథులా పాస్ ప్రాచీన సిల్క్ రూట్లో కీలకమైన మార్గంగా గుర్తింపు పొందింది.
లాంగేవాలా 1971 భారత్, పాకిస్తాన్ యుద్ధ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రదేశం.
గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారులలో ఒకటి.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు


