-
భారత ఆర్చర్ల పసిడి పంట
షార్జా: ఆసియా కప్ స్టేజ్–3 ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఇందులో ఐదుస్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. కాంపౌండ్ విభాగంలో భారత్కు ఏకంగా ఏడు పతకాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయిలు క్లీన్స్వీప్ చేశారు. ప్రగతి స్వర్ణం నెగ్గగా... అదితి స్వామి రజతం, పర్ణీత్ కౌర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్ స్వర్ణం, ఓజస్ రజతం నెగ్గారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. ఆకాశ్, మృణాల్ చౌహాన్, పార్థ్ సాలుంకేలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో త్రిషా పూనియా, పార్థ్ సాలుంకేలతో కూడిన టీమిండియా రజతం నెగ్గింది. -
ISSF World Championship: 18 ఏళ్లకే ప్రపంచ చాంపియన్
కైరో: విశ్వ వేదికగా మరోసారి భారత షూటర్ గురి అదిరింది. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్లో భారత్ ‘పసిడి’ ఖాతా తెరిచింది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ ప్రదర్శనతో రుద్రాంక్ష్ 2024 పారిస్ ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించాడు. థానేకు చెందిన రుద్రాంక్ష్ ఫైనల్లో 17–13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజో (ఇటలీ)పై గెలుపొందాడు. తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో ఆడుతున్న రుద్రాంక్ష్ ఫైనల్లో ఒకదశలో 4–10తో వెనుకంజలో ఉన్నాడు. అయినా ఒత్తిడికి లోనుకాకుండా లక్ష్యంపై గురి పెట్టిన ఈ టీనేజ్ షూటర్ చివరకు నాలుగు పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు 114 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్లో రుద్రాంక్ష్ 633.9 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన అంకుశ్ కిరణ్ జాదవ్ 630.6 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్ మ్యాచ్కు అర్హత సాధించారు. ర్యాంకింగ్ మ్యాచ్లో సొలాజో 262.7 పాయింట్లతో, రుద్రాంక్ష్ 261.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వర్ణ పతక పోరుకు అర్హత పొందారు. అంకుశ్ 154.2 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ర్యాంకింగ్ మ్యాచ్లో 261.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన చైనా షూటర్ లిహావో షెంగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ షూటర్గా రుద్రాంక్ష్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా రుద్రాంక్ష్ రికార్డు నెలకొల్పాడు. గత ఏడాది పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో రుద్రాంక్ష్ రజతం నెగ్గగా.. ఈ ఏడాది జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించాడు. ఈ సంవత్సరమే సీనియర్ జట్టులోకి వచ్చిన రుద్రాంక్ష్ రెండు ప్రపంచకప్లలో పాల్గొన్నా పతకం సాధించలేకపోయాడు. అయితే ప్రపంచ చాంపియన్షిప్లో మెరిసి స్వర్ణంతోపాటు ఒలింపిక్స్కు అర్హత పొంది ఔరా అనిపించాడు. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన ఆరో భారతీయ షూటర్ రుద్రాంక్ష్ . గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్జిత్ సంధూ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్) ఈ ఘనత సాధించారు. -
commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’
శరత్ కమల్ తొలి కామన్వెల్త్ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్హామ్ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్డ్లో ఇంకా ఫైనల్ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్ అయిన ఆయన ప్రతీ మ్యాచ్లో, ప్రతీ పాయింట్కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. చివరకు నేను పాయింట్ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్ అన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడాను. నా కోచ్ సోమ్నాథ్ ఘోష్కు శరత్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా శరత్ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్డ్ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’ -
Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్’ కాలం
2006 – మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు – టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్జెల్పై విజయంతో స్వర్ణం... 2022 – బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలు– సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్ఫోర్డ్పై విజయంతో స్వర్ణం... ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్ ఆటగాడే ఆచంట శరత్ కమల్. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే... వరుసగా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని శరత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్ కమల్ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు. కొత్త కుర్రాడిలాగే... సుదీర్ఘ కాలంగా భారత టేబుల్ టెన్నిస్ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచి శరత్ కమల్ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. -
Commonwealth Games 2022: భారత్ పతకాల మోత
కామన్వెల్త్ గేమ్స్లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు. బర్మింగ్హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు. హాకీలో మూడోసారి... పురుషుల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. అవినాష్, ప్రియాంక అద్భుతం అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్కిది తొమ్మిదోసారి కావడం విశేషం. తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్ బౌల్స్లో రజతం లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement