మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్‌.. పిన్నెల్లితో వాగ్వాదం | Political Heat in Macherla as Police Stop YSRCP Protest Camp Setup | Sakshi
Sakshi News home page

మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్‌.. పిన్నెల్లితో వాగ్వాదం

Aug 6 2026 6:51 AM | Updated on Aug 6 2026 6:59 AM

Political Heat in Macherla as Police Stop YSRCP Protest Camp Setup

సాక్షి, పల్నాడు: మాచర్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షల్లో నిర్వహించనుంది. ఇందులో భాగంగా మాచర్లలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని గతరాత్రి పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలం వద్ద దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేపట్టారు. అయితే శిబిరం ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

“సొంత స్థలంలో దీక్ష చేసుకునే హక్కు కూడా లేదా?”
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన దీక్షలు చేపడుతుంటే మాచర్లలో మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తన సొంత స్థలంలో శాంతియుతంగా దీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమతులు లేకుండా దీక్ష నిర్వహించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. సొంత స్థలమైనప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి అవసరమని పేర్కొంటూ ఏర్పాట్లను నిలిపివేశారు.

నేడు వైఎస్సార్‌సీపీ నిరసనలు
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అయితే ఇటు మాచర్లలో దీక్షా శిబిరం ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ నేతలు దీనిని ప్రభుత్వ అణచివేతగా మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement