బీజింగ్: టెక్నాలజీ రంగంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ఎలన్ మస్క్కు చెందిన 'న్యూరాలింక్' వంటి సంస్థలు పుర్రెను తెరిచి మెదడులో చిప్లను అమర్చే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, అత్యంత సులభమైన, తక్కువ రిస్క్ ఉన్న సరికొత్త బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి.
షాంఘైకి చెందిన ‘స్టైర్మెడ్ టెక్నాలజీ’ అనే స్టార్టప్ సంస్థ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులతో కలిసి పుర్రెను తెరవకుండానే మెదడులో చిప్ను అమర్చే సరికొత్త విధానంపై పరిశోధనలు చేస్తోంది.
ఈ పద్ధతిలో మెదడుపై నేరుగా సర్జరీ చేయడం లాంటి పెద్ద ప్రమాదాలకు తావు ఉండదు. వైద్యులు మెడలోని రక్తనాళం ద్వారా ఈ చిన్న పరికరాన్ని లోపలికి పంపి, రక్తనాళాల వ్యవస్థ గుండా దానిని నేరుగా మెదడులోని నిర్దేశిత ప్రాంతానికి చేరుస్తారు. ఆ తర్వాత ఆ డివైస్ను రక్తనాళం గోడ వెలుపల సురక్షితంగా ఉంచుతారు.
బీజింగ్ క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన జ్సువాన్వు హాస్పిటల్ వైద్యుడు దువాన్ వాన్ రు మాట్లాడుతూ.. తగిన అనుభవమున్న సర్జన్ ఈ పరికరాన్ని కేవలం 10 నిమిషాల్లోనే సరైన స్థానంలో అమర్చగలరని తెలిపారు.
ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటివరకు గొర్రెలపై విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే నెల రోజుల్లోపు ఆ ఇంప్లాంట్ను సులభంగా వెనక్కి తీసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
పక్షవాతం, వెన్నుముక గాయాలు లేదా ఇతర తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ తమ అవయవాలను కదిలించలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది. మెదడు ఇచ్చే సంకేతాలను ఈ చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరవేయడం ద్వారా వారు తమ ఆలోచనల ద్వారానే డివైయర్లను కంట్రోల్ చేయవచ్చు.
అలీబాబా, టెన్సెంట్ వంటి దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో ముందుకు వెళ్తున్న ఈ టెక్నాలజీ, రాబోయే రోజుల్లో న్యూరో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


