ఎలాంటి నష్టమూ జరిగేది కాదు
విభజన పాపం కాంగ్రెస్దే: యోగి ఆదిత్యనాథ్
లక్నో: భారతదేశ విభజనకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అప్పట్లో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఉండి ఉంటే దేశానికి ఎలాంటి నష్టమూ జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సర్దార్ వల్లభ్భాయ్పటేల్ లాంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నా దేశం ముక్కలయ్యేది కాదని స్పష్టం చేశారు. 1948 నాటి దేశ విభజనపై శుక్రవారం లక్నోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ విభజనతోపాటు తదనంతరం చెలరేగిన హింసకూ అసలు బాధ్యత కాంగ్రెస్దేనని పునరుద్ఘాటించారు.
‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిఉంటే భారత్కు ఎవరూ ఇసుమంత నష్టమూ చేయగలిగి ఉండేవారు కాదు’’అని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుల పిరికితనానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్భంగానూ కాంగ్రెస్ అలాంటి వ్యక్తిత్వాన్నే చూపిందని వ్యాఖ్యానించారు. విభజన, ఇతర చారిత్రక తప్పులకు భారతదేశం ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం, ఇతర అతివాద రూపాల రూపంలో ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని ఆదిత్యనాథ్ అన్నారు. విభజనను ‘‘మానవాళి చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం’’గా ఆయన అభివరి్ణంచారు.


