హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరుగుతున్న పోల్యాక్ ఇమ్రే, వర్గా జానోస్ & కొజ్మా ఇస్త్వాన్ మెమోరియల్ సీనియర్ ర్యాంకింగ్ సిరీస్-2026లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. మూడో రోజు పోటీల్లో మాజీ అండర్-17 ప్రపంచ చాంపియన్ నేహా మహిళల 59 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలవగా, మాన్సీ 62 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
59 కేజీల ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగైల్ ఈ.నెట్ పై నేహా 6-4 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. ఈ విజయంతో టోర్నీలో భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. తొలి రోజు ఒలింపిక్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.
మహిళల 62 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన మాన్సీ, కెనడాకు చెందిన అనా పి. గోడినెజ్ గోన్జాలెజ్తో తలపడింది. అయితే గాయం కారణంగా మ్యాచ్ను పూర్తి చేయలేక రజత పతకంతో సరిపెట్టుకుంది.
అదే విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సవిత కజకిస్థాన్కు చెందిన ఇరీనా కుజ్నెత్సోవాపై 14-5తో ఘన విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
మూడో రోజు ముగిసే సరికి భారత్ ఖాతాలో మొత్తం 8 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
భారత్ పతకాల వివరాలు:
మహిళలు
* 59 కేజీలు: నేహా – స్వర్ణం
* 55 కేజీలు: హన్సికా లాంబా – రజతం
* 62 కేజీలు: మాన్సీ – రజతం
* 62 కేజీలు: సవిత – కాంస్యం
పురుషుల ఫ్రీస్టైల్
* 57 కేజీలు: అమన్ సెహ్రావత్ – స్వర్ణం
* 61 కేజీలు: దీపక్ – కాంస్యం
* 65 కేజీలు: విశాల్ కలీరామన్ – కాంస్యం
* 125 కేజీలు: రజత్ రూహల్ – కాంస్యం


