పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు! | Hungary Horror: Hospital Worker Accused of Cannibalism | Sakshi
Sakshi News home page

పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు!

Jun 27 2026 1:29 PM | Updated on Jun 27 2026 1:56 PM

Hungary Horror: Hospital Worker Accused of Cannibalism

పగలంతా ఆస్పత్రిలో తెల్ల కోటు వేసుకుని రోగులకు సేవలు.. రాత్రి ఇంటికొచ్చాక మాత్రం మనిషి ఊహించలేని భయానక ప్రపంచం!. మానవ అవయవాలను సేకరించడం.. ఇంట్లో దాచుకోవడం.. వాటితో వింత ప్రయోగాలు చేయడం.. చివరకు వాటిలో కొన్నింటిని తానే తిన్నానని పోలీసుల ఎదుట ఒప్పుకోవడం!. ఇదెదో డబ్బింగ్‌ సినిమా కథ అనుకునేరు!. ఒక ఆస్పత్రి ఉద్యోగి గురించి బయటపడిన ఈ నిజాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. అతడి ఇంట్లో కనిపించిన దృశ్యాలు హారర్‌ సినిమాలను తలపించగా.. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆస్పత్రిలో పేషెంట్‌ ట్రాన్స్‌పోర్టర్‌ (రోగులను తరలించే ఉద్యోగి)గా పని చేసే ఉద్యోగి(30) చీకటి కోణం షాక్‌కు గురి చేస్తోంది. మానవ అవశేషాలను అక్రమంగా సేకరించడం, వాటిని తన ఇంట్లో నిల్వ చేయడం, చివరకు.. వాటిని వండుకోకుండా పచ్చిగా తీసేశాడన్న అనుమానాలతో పోలీసులు సోదాలు జరిపారు. తనిఖీల్లో దాదాపుగా అవే నిజాలని తెలిసి నిర్ఘాంత పోయారు. చివరకు.. అరెస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో వెలుగుచూసింది.

సోదాల్లో అతడి ఇంట్లో కనిపించిన దృశ్యాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. మనిషి తల, ముఖం మీది చర్మం, కాలు భాగం, మెదడు, చేయి, పలు పుర్రెలు, ఎముకలు, సూట్‌కేసులో దాచిన అస్థిపంజర భాగాలు.. ఇవన్నీ ఒక ఎత్తయితే ఒక జాడీలో భద్రపరిచిన గుండె పోలీసులకు మాట పడిపోయేలా చేసింది.( ఆ గుండె మనిషిదేనా? లేక జంతువుదా? అనేది ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలాల్సి ఉంది)!.

జూన్‌ 17వ తేదీన అతన్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేయగా.. 23న ఆ విషయం బయటకు వచ్చింది. విచారణలో నిందితుడు.. మానవ శరీర భాగాలపై తనకు అమితమైన ఆసక్తి  ఉందని.. అందుకే కొన్నింటిని శరీరాల నుంచి తానే వేరుచేసి తిన్నానని అంగీకరించాడు. శరీర నిర్మాణ శాస్త్రం (అనాటమీ), పాథాలజీపై అతడికి విపరీతమైన ఆసక్తి ఉండేదని, జంతువులను కోసి పరిశీలించడం కూడా అతడి హాబీగా మారిందని పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. అతడు పనిచేసే ఆస్పత్రి నుంచి, అలాగే హంగేరీ, పొరుగు దేశమైన స్లోవేకియాలోని శ్మశాన వాటికల నుంచి అనాథ శవాల అవశేషాలను దొంగిలించాడని పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న అవయవాలు ఎవరివి? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

ఈ కేసులో భాగంగా నిందితుడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర స్టోరేజ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. అయితే తన ఎముకల సేకరణ గురించి మాత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా బహిరంగంగా మాట్లాడేవాడని, వాటి ఫొటోలు తీసి భద్రపరచేవాడని అధికారులు వెల్లడించారు. అయితే అతన్ని పట్టించిన టిప్‌ గురించి మాత్రం పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

మరిన్ని కేసులు..
ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. సమాధుల నుంచి మృతదేహాలను ఎలా బయటకు తీశాడు? ఆస్పత్రి నుంచి మృతదేహాల అవశేషాలను ఎలా ఎత్తుకు రాగలిగాడు? అతనికి ఎవరైనా సహకరించారా? నరమాంస భక్షణలో ఇంకా ఎవరైనా పార్టనర్‌లు ఉన్నారా?.. ఇలా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత నిందితుడిపై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని హంగేరీ దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement