వడగాలుల ధాటికి ఐరోపా ఖండం అట్టుడికిపోతుంది. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండ వేడిమి తట్టుకోలేక వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వడగాలల ధాటికి కేవలం ఒక్క వారంలోనే సాధారణం కంటే సుమారు 16,000 మందికి పైగా అదనంగా మరణించారని యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ సర్వేలో తేలింది.
ఈ మరణాలలో అత్యధికంగా ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ వంటి ఉత్తర,వాయువ్య ఐరోపా దేశాల నుంచే నమోదయ్యాయి. సాధారణంగా చల్లటి వాతావరణానికి అలవాటుపడిన ఈ దేశాల ప్రజలు, ఒక్కసారిగా సంభవించిన ఈ తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఐరోపా అంతటా ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు, కేవలం ఫ్రాన్స్, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ బెల్జియం ,జర్మనీ దేశాలలో మరణాల సంఖ్య పెద్దఎత్తున పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాలు ఇటువంటి ఆకస్మిక వేడిని తట్టుకునేందుకు ముందస్తుగా సిద్ధంగా లేకపోవడమే అని సర్వే తేల్చింది.
ఉత్తర ఐరోపాలోని ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ (AC) వాడకం చాలా తక్కువగా ఉండటం వల్ల, ప్రజలు ఇళ్లలోనే ఉక్కపోతతో అల్లాడిపోయారనిపేర్కొంది. ఇది ఇప్పుడు అక్కడ ఒక పెద్ద రాజకీయ అంశంగా కూడా మారింది. దీనికి భిన్నంగా, శతాబ్దాలుగా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్న దక్షిణ ఐరోపా దేశాలు మాత్రం ఈ వేడిని తట్టుకునేందుకు కొన్ని సాంప్రదాయ మార్గాలను కలిగి ఉండటంతో అక్కడ ప్రాణనష్టం కొంత మేర తగ్గిందని తెలిపింది.సాధారణంగా వైరస్ల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే శీతాకాలం కంటే కూడా, ఈ జూన్ నెలలో సంభవించిన వడగాల్పుల వల్లనే ఎక్కువ మంది చనిపోయారు.
గతంలో 2003లో వచ్చిన భయంకరమైన హీట్వేవ్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఆ తర్వాత, 2022 జూలై నెలలో కూడా తీవ్రమైన వడగాల్పులు రావడంతో 16,000 మందికి పైగా అదనపు మరణాలు సంభవించాయని యూరోపియన్ మోర్టాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ గుర్తుచేసింది. ఆ సమయంలో స్పెయిన్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూన్ రికార్డు సృష్టించినప్పటికీ, భూతాపం వల్ల భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన రోజులను చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఐరోపాలోని మెజారిటీ ప్రాంతాలు మరో భయంకరమైన వడగాల్పుల తదుపరి దశను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నమోదైన రికార్డు స్థాయి ఎండల వల్ల నదులలో నీటి మట్టాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి, అలాగే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి వేలాది మంది మరణానికి కారణమయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలో ఈ వారంలోనే తీవ్రమైన హీట్వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి, అక్కడ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


