ముంబై: ముంబైలోని నేవీ నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన ఒక నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు తమ నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నావికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే ఇంట్లో రెండు నెలలు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లల మృతదేహాలు కూడా లభించాయి. ప్రాథమిక పరిశోధనలో పిల్లలు విషప్రయోగం వల్ల మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు వస్తేనే నిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవారు, ఇతర సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు లియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇండియన్ నేవీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొలాబాలోని నేవీ నగర్లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో నావికుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తునకు నావికాదళం పూర్తిగా సహకరిస్తున్నదని పేర్కొంది.
ఇది కూడా చదవండి: కుర్చీలో ఇరుక్కుపోయిన మెడ.. షాకింగ్ వీడియో!


