అత్యంత లోపభూయిష్టంగా సర్‌ ప్రక్రియ: లేళ్ల అప్పిరెడ్డి | Sir Process Is Deeply Flawed: Lella Appi Reddy | Sakshi
Sakshi News home page

అత్యంత లోపభూయిష్టంగా సర్‌ ప్రక్రియ: లేళ్ల అప్పిరెడ్డి

Jul 10 2026 9:12 PM | Updated on Jul 10 2026 9:16 PM

Sir Process Is Deeply Flawed: Lella Appi Reddy

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో ప్రత్యేక ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ ముగుస్తున్నా.. ఇంకా పలు చోట్ల లోపాలు బయట పడుతున్నాయని, మరీ ముఖ్యంగా మై టీడీపీ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే సర్‌లో వివరాలు డిజిటలైజేషన్‌ చేస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. అధికార టీడీపీ సర్‌ ప్రక్రియను కూడా తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నా.. తాము పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు.

ఇప్పటికైనా ఈసీ రాజ్యాంగ బద్దంగా సర్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని, లోపాల్ని వెంటనే సరిద్దడంతో పాటు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం గడువు పొడిగించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రెస్‌ మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

లోపభూయిష్టంగా సర్‌ ప్రక్రియ:
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ, ఫారాలు తీసుకోవడంలో కానీ, ఫారాలు పూర్తి చేయడంలో కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి లోపభూయిష్టంగా మారింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి, దొంగ ఓట్లు తొలగించాలని.. డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలని ఎవరైనా కోరుకుంటారు.

అలాగే వైఎస్సార్‌సీపీ కూడా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలనే ఆలోచనతో అందులో పాలుపంచుకుంటోంది. కానీ, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కూడా రాజకీయ లబ్ది పొందాలి. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని, ఇతర పార్టీల ఓట్లు తొలగించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ సక్రమంగా జరగకపోయినా కూడా 99 శాతం పైచిలుకు పూర్తయినట్లు అధికారులు ఈసీకి లెక్కలు ఇస్తున్నారు.  అసలు ఏమిటీ దౌర్భాగ్యం అని అడుగుతున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించరా? ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితి లేదా? ఏ కార్యక్రమాన్ని అయినా కూడా తమకు, తమ పార్టీకి ఉపయోగపడే విధంగా తీసుకుపోవడమేనా? ఇదేనా టీడీపీ, చంద్రబాబు మార్క్‌ వైఖరి?

మై టీడీపీ యాప్‌ లో నమోదు తర్వాతే ’సర్‌’ లోకి:
ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తి చేసిన తర్వాత సహజంగా బీఎల్వోలుగా నియమించిన వారో, లేకపోతే ఏఈఆర్వోలుగా ఉన్నవారో డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపడతారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా ఇదే విధానం అమలు చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో డిజిటలైజేషన్‌ కు ముందే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల ఫారాలని టీడీపీ నాయకులు వాళ్ళ ’మై టీడీపీ’ యాప్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు పంపిస్తున్నారు.

ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిస్ధితి ఉందా? ఎప్పుడైతే టీడీపీ కార్యాలయాల్ని, ఎమ్మెల్యేల కార్యాలయాలని వేదికగా చూసుకొని మై టీడీపీ యాప్‌ లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారో అప్పుడే వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఓటరుకు ఉన్న గోప్యత టీడీపీ యాప్‌ లోకి వెళ్తుందని ఫిర్యాదు చేశాం. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటర్ల జాబితా ఉంటుందో లేదో అనుమానాలు ఉన్నాయి, కానీ టీడీపీ ఆఫీసుల్లో మాత్రం ఈ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలు మొత్తం కూడా దర్శనమిస్తున్నాయి. ప్రతి చోటా అధికారులు బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు.

ఇవీ అక్రమాలకు నిదర్శనాలు:
తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే పీఏ నాగార్జున ఇలాగే బెదిరిస్తున్న ఆడియో వింటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితి అర్థమవుతుంది. ఇదే కాదు జూన్‌ 22న నెల్లూరులో అక్కడ ఈఆర్‌ఓ గా ఉన్న మున్సిపల్‌ కమిషనర్‌ బీఎల్వోలతో సమావేశం పెట్టి, మంత్రి నారాయణను, మేయర్, డిప్యూటీ మేయర్‌ ను భాగస్వాముల్ని చేశారు. దీనిపై ఆ తర్వాత రోజే అంటే జూన్‌ 23న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశాం. అయినా చర్యలు లేవు.

మరో రోజు నెల్లూరు కమిషనర్‌ మళ్లీ తిరిగి మంత్రి నారాయణ టీడీపీకి చెందిన బీఎల్వోలతో సమావేశం పెట్టుకుంటే అందులో ఆయన కూడా జాయిన్‌ అయి మై టిడిపి యాప్‌ తప్పనిసరిగా వాడుకోవాలని చెప్పారు. మళ్లీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. జూలై 2న నరసరావుపేట 118 పోలింగ్‌ స్టేషన్‌ లో ఉన్న బీఎల్వోని అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన బీఎల్వో బెదిరిస్తే ఆయన పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.

టీడీపీ డ్యాష్‌ బోర్డులో సర్‌ వివరాలు:
అసలు దురదృష్టం ఏమిటంటే ఒక బీఎల్వోని టీడీపీకి సంబంధించినటు వంటి బీఎల్‌ఏ బెదిరిస్తే బీఎల్వోకి మద్దతుగా నిలబడాల్సిన అధికారులు ఒత్తిడి తెచ్చి కేసు వెనక్కి తీసుకోమన్నారు. రేపల్లెలోని చెరుకుపల్లి మండలంలోని రాంబోట్లవారిపాలెంలో సేమ్‌ ఇదే పరిస్ధితి. పూర్తి చేసిన ఎన్యుమరేషన్‌ ఫారాలన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి ఇవ్వాలి, వాళ్ళు మై టీడీపీ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత అవి తిరిగి అక్కడి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలం కొరిమేర్ల సచివాలయంలో సాక్షాత్తు వీఆర్వో సమక్షంలో ఇద్దరు టీడీపీ వ్యక్తులు మొత్తం ఫారాలన్నీ మై టీడీపీ యాప్‌లో నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టారు.

ఈ అరాచకం ప్రతీ నియోజకవర్గంలోనూ కొనసాగుతోంది. ప్రతి చోటా టీడీపీ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నటువంటి పరిస్థితులు. టీడీపీ నాయకులు ఒక డాష్‌ బోర్డ్‌ పెట్టుకుని, అందులో మొత్తం 175 నియోజకవర్గాల ఓటర్ల వివరాలు అప్లోడ్‌ చేస్తున్నారు. ఇక ఎన్నికల కమిషన్‌ ఎందుకు, శుభ్రంగా టీడీపీ ఆఫీసులో పెట్టుకుంటే మేము కూడా అక్కడికి వచ్చే మా ఓట్లు కూడా నమోదు చేయించుకుంటాం.

ఇదేమైనా మీ ప్రైవేట్‌ కార్యక్రమమా, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమమా ? ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన కార్యక్రమం, నిష్పక్షపాతంగా జరగాల్సిన కార్యక్రమం, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇవ్వాల్సిన కార్యక్రమం కాదా? దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అలా ఓ దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అందుకే ఎన్నికల ప్రధానాధికారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. మీకున్న విశేష అధికారాలను బయటికి తీయాలి. ఇంత కీలకమైన కార్యక్రమానికి సంబంధించి మీరు కళ్లు ఉండి చూడలేని విధంగా, చెవులు ఉండి వినలేని విధంగా, నోరు ఉండి మాట్లాడలేని విధంగా ఉంటే, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయి. దీన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం వెనుకాడని పరిస్థితుల్లో ముందుకు సాగుతోంది.

ఇప్పటికైనా ఈసీ జోక్యం చేసుకోవాలి:
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీగా కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పౌరుడిగా ఒక ఓటర్‌ గా ఎక్కడెక్కడైతే డూప్లికేట్‌ ఓట్స్‌ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే దొంగోట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే చనిపోయిన వాళ్ళు సైతం కూడా ఇప్పుడు ఈ ఓటర్‌ లిస్ట్‌ లో బతికి ఉన్నారో, అవన్నీ కూడా తీసేయాలి. గ్రామ పంచాయతీ ఆఫీసులకు వెళ్తే, మున్సిపాలిటీకి వెళితే చనిపోయిన వాళ్ళ లిస్ట్‌ ఉంటుందే.. అది ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా, ఆ లిస్టులు తీసుకొని డైరెక్ట్‌ గా తీసివేసే పరిస్థితులు ఉంటాయి. మరో మూడు రోజుల్లో ఈ సర్‌ ప్రక్రియ పూర్తవుతోంది. తగిన సమయం కూడా లేదు.

ఇన్ని లోపాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కనీసం మరో నెల రోజులు పొడిగించాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఓట్లు ఉండేలా తీసుకోవాలని మరోసారి ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం ఇస్తాం. సహజంగా వీకెండ్స్‌ లోనే ఉద్యోగాలు చేసేవాళ్ళు, బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ స్వగ్రామాలకి వస్తుంటే, బీఎల్వోలు మాత్రం టీడీపీ వాళ్లకు ఇచ్చాం, టీడీపీ ఆఫీసులో తీసుకోమని చెప్తున్నారు.

అందుకే ఎన్నికల కమిషన్‌ ఈ లోపాలను సరిదిద్దే కార్యక్రమాన్ని తక్షణం చేపట్టలి. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఓటు ఉండాలి. హైదరాబాద్‌లో ఒకచోట, బెంగళూరులో ఒకచోట, లేకపోతే గ్రామాల్లో ఒకచోట, టౌన్‌ లో ఒకచోట ఓట్లు ఉండటం సరికాదు. ఇలా ఒకే ఓటరుకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓట్లపైనా ఈ నెల 14 తర్వాత ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement