20 టన్నుల వెండిలో 5% మాత్రమే ఒరిజినల్‌.. షాక్‌లో భక్తులు | Vaishno Devi Silver Scam Full Details Here | Sakshi
Sakshi News home page

20 టన్నుల వెండిలో 5% మాత్రమే ఒరిజినల్‌.. షాక్‌లో భక్తులు

Jul 14 2026 5:21 PM | Updated on Jul 14 2026 5:33 PM

Vaishno Devi Silver Scam Full Details Here

Representative image

వైష్ణోదేవి ష్రైన్ బోర్డులో రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి కానుకల అవకతవకల కేసులో జమ్మూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మునీశ్‌ కుమార్ మన్హాస్ కోర్టు.. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు అధికారిని అన్ని అవసరమైన రికార్డులతో జులై 29న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం జరిగిన విచారణలో జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు న్యాయవాది దీపక్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఆలయంలో భక్తులు సమర్పించిన వెండి కానుకల్లో కల్తీ, మార్పిడి, దుర్వినియోగం జరిగిందంటూ దీపక్ శర్మ ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో ఏముంది?
దీపక్‌ శర్మ మే 9న ఇచ్చిన ఫిర్యాదులో నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, నిధుల దుర్వినియోగం, రికార్డుల్లో తారుమారు, క్యాడ్మియం కలిపిన నకిలీ వస్తువుల కొనుగోలు-అమ్మకం వంటి తీవ్రమైన నేరాల ప్రస్తావన ఉంది.

దీపక్ శర్మ ఐజీపీ క్రైమ్ బ్రాంచ్, ఎస్‌ఎస్‌పీ క్రైమ్ బ్రాంచ్ (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) ముందు విస్తృత ఫిర్యాదు సమర్పించారు. పూర్తి దర్యాప్తు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. క్రైమ్ బ్రాంచ్ స్పష్టమైన చర్య తీసుకోకపోవడంతో శర్మ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల తర్వాత క్రైమ్ బ్రాంచ్ స్టేటస్ రిపోర్టు సమర్పించింది. ఫిర్యాదును పరిపాలనా స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని అందులో తెలిపింది.

సోమవారం స్టేటస్ రిపోర్టుపై విచారణ సమయంలో అడ్వొకేట్ దీపక్ శర్మ విస్తృత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫిర్యాదును కేవలం ఫైళ్ల మధ్య తిప్పడం వల్ల నేరాలపై చట్టపరమైన చర్య తీసుకున్నట్టుకాదని వాదించారు. క్రైమ్ బ్రాంచ్ స్వయంగా నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ అని, భారతీయ నాగరిక భద్రత సంహిత 2023 ప్రకారం ఫిర్యాదుపై నేరుగా చర్య తీసుకునే బాధ్యత దానిదేనని చెప్పారు. స్టేటస్ రిపోర్టులో ఆధారాలను భద్రపరిచే చర్యల ప్రస్తావన లేదని కూడా పేర్కొన్నారు. ఇన్వెంటరీ రిజిస్టర్, స్టాక్ రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు, రవాణా పత్రాలు, అస్సే రిపోర్టులు (లోహం స్వచ్ఛతను పరీక్షించి ఇచ్చే నివేదిక), మింట్ ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రసాదం స్వీకరణ, నిల్వ, రవాణా, పరీక్షలు, కరిగింపు ప్రక్రియలకు సంబంధించిన అన్ని రికార్డులను ప్రస్తావించారు.

వివాదానికి కారణం ఏమిటి?
ఆలయంలో సేకరించిన దాదాపు 20 టన్నుల వెండి (విలువ సుమారు రూ.550 కోట్లు) పరీక్షలు, కరిగింపు, ప్రాసెసింగ్‌ కోసం పంపినట్టు వెలుగులోకి రావడంతో ఈ విషయం సంచలనమైంది. దర్యాప్తులో కేవలం 5-6 శాతం మాత్రమే అసలు వెండి అని తేలింది. మిగిలిన భాగం నకిలీగా గుర్తించారు. అందులో క్యాడ్మియం, ఇనుము, ఇతర నాసిరకం లోహాలు ఉన్నట్టు బయటపడింది. భక్తులకు నగల వ్యాపారులు నకిలీ వెండి విక్రయించారా, లేక అసలు కానుకలను తర్వాత మార్చారా, పలుచగా చేశారా, దొంగిలించారా, తప్పుగా వినియోగించారా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని దీపక్ శర్మ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement