అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి | Raushan Sir brother Prince Yadav dies in Nepal under suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి

Jun 14 2026 1:14 PM | Updated on Jun 14 2026 1:45 PM

Raushan Sir brother Prince Yadav dies in Nepal under suspicious circumstances

పాట్నా: బిహార్‌ రాష్ట్రం పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రౌషన్ ఆనంద్ (రౌషన్ సర్) సోదరుడు ప్రిన్స్ యాదవ్ నేపాల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆయనపై ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌పై దాడి, విధ్వంస్వం కేసు ఆరోపణలు ఉన్నాయి.

రౌషన్ ఆనంద్ పాట్నాలోని జ్ఞాన్ బిందు జీఎస్‌ అకాడమీ డైరెక్టర్. ఆయన ప్రత్యర్థి ఫైసల్ ఖాన్ (ఖాన్ సర్), ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఈ రెండు సంస్థల మధ్య పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల సంఖ్య, క్యాంపస్ నియంత్రణ వంటి అంశాలపై కొన్నేళ్లుగా తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో ఈ రెండు ఇనిస్టిట్యూట్‌ల మధ్య ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. ఈఘటనకు సంబంధించి కేసులో రౌషన్‌ ఆనంద్‌ అరెస్టు కాగా ప్రిన్స్‌ యాదవ్‌ దాడి కేసులో అభియోగం ఎదుర్కొంటూ పరారీలో ఉన్నారు. 

ఈ క్రమంలో ప్రిన్స్‌యాదవ్‌ నేపాల్‌లోని బిరాట్నగర్‌లోని హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. అదే హోటల్‌లో ప్రిన్స్‌ యాదవ్‌తో పాటు తన ఆరుగురు స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్‌ యాదవ్‌ స్నేహితులు, ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రిన్స్‌ మరణంపై స్పష్టత రాలేదు.  

ప్రిన్స్‌ యాదవ్‌ మృతి వార్త తెలిసిన వెంటనే రౌషన్ ఆనంద్ కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరారు. ఈ ఘటనతో పాట్నాలోని కోచింగ్ హబ్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికంగా పోలీస్ బలగాలను పెంచి అప్రమత్తం చేశారు. ఈ ఘర్షణ విద్యార్థుల మధ్య కూడా హింసాత్మక రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆరోపణలు
2021నుంచి రౌషన్‌ ఆనంద్‌ సోదరుడు ప్రిన్స్ యాదవ్‌పై పలు ఆరోణలు కొనసాగుతున్నారు. 2021 ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌లోకి దూసుకెళ్లి హింసాత్మక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2న విధ్వంసం ఘటనకు సంబంధించిన కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ప్రిన్స్‌ పేరును చేర్చారు. ఈ కేసులో రౌషన్ ఆనంద్ ఇప్పటికే పాట్నా జైలులో ఉన్నారు. కాగా ఖాన్ సర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రౌషన్‌ ఆనంద్ సోదరుడు అనుమానాస్పద మృతితో పరిస్థితులు మరింత దిగజారాయి.  

బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు
గత మే 27న బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ సెలెక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ , బిహార్ అధికారికంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించింది. మొత్తం 19,838 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే ఈ ఫలితాలు కోచింగ్‌ హబ్‌గా పేరొందిన పాట్నాలోని ముసల్లాపూర్‌ కిసాన్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ క్యాంపస్‌లో ఖాన్ సార్ (ఖాన్‌ సార్‌) కోచింగ్ సెంటర్, జ్ఞాన్ బిందు జీఎస్ అకాడమీ (రౌషన్ సార్) మధ్య చిచ్చు రాజేసింది. ఇద్దరూ తమ ఇన్స్టిట్యూట్‌ నుంచి వేలాది మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించడంతో పోస్టర్లు చించుకోవడం, హింసాత్మక దాడులు, కేసులు వరకు వివాదం పెరిగింది.

ఖాన్‌ సార్‌పై ఆరోపణలు
ఖాన్ సార్ తన ఇనిస్టిట్యూట్‌ నుంచి 12,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. రౌషన్ ఆనంద్ తన జ్ఞాన్ బిందు అకాడమీ నుంచి 10,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించారు. ఇద్దరూ టాపర్ అభిషేక్ పటేల్ తమ విద్యార్థి అని ప్రకటించడం, అభిషేక్ పటేల్.. ఖాన్ సార్‌ని కలవడం, ఆయన బ్లెసింగ్స్‌ తీసుకోవడంతో రౌషన్ ఆనంద్‌ను ఆగ్రహానికి గురి చేసింది. అభిషేక్‌ పటేల్‌ను ఖాన్ సర్ రూ.10 లక్షలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. అభిషేక్ పటేల్ ఈ ఆరోపణలను ఖండించారు.

అయితే జూన్ 2న జ్ఞాన్ బిందు అకాడమీకి చెందిన సుమారు 20 మందివారు ఖాన్ సర్ ఇనిస్టిట్యూట్‌పై దాడి చేశారు. ఇనిస్టిట్యూట్‌లో వస్తువుల్ని ధ్వంసం చేయడం,రాళ్లు రువ్వారు. దీంతో ఖాన్‌ సార్‌ బాడీగార్డులు గాల్లో కాల్పులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జ్ఞాన్ బిందు డైరెక్టర్ రౌషన్ ఆనంద్, ఆయన సోదరుడు ప్రిన్స్ యాదవ్‌తో పాటు ఇతరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖాన్‌ సార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రౌషన్‌ ఆనంద్‌పై జైలు శిక్ష పడింది. ప్రిన్స్‌ యాదవ్‌ బెయిల్‌ మీద విడుదలయ్యారు. ఖాన్‌ సార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ప్రిన్స్‌ యాదవ్‌ అనుమానాస్పద మృతితో బిహార్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement