విద్యార్థులపైకి ఏకే–47 | Bihar police constable firing with AK-47 at protest against NEET paper leak | Sakshi
Sakshi News home page

విద్యార్థులపైకి ఏకే–47

Jul 28 2026 4:52 AM | Updated on Jul 28 2026 4:52 AM

Bihar police constable firing with AK-47 at protest against NEET paper leak

బిహార్‌లో నిరసనకారులపై  4 రౌండ్ల బుల్లెట్లు

ఆలస్యంగా వెలుగులోకి కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ సస్పెండ్‌

పట్నా: కాక్రోచ్‌ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్‌ దిశగా ‘చలో సంసద్‌ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏకంగా ఏకే–47 మారణాయుధాన్ని ప్రయోగించిన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. 

శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలను లాఠీచార్జ్‌తో రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి చివరకు ఏకే–47 గన్‌ను పోలీసులు వినియోగించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగింది? 
పట్నా, సరణ్‌ జిల్లాలోని ఛాప్రా, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్, సమస్తీపూర్, నవాడా,        పూరి్ణయా, నలందా, బోజ్‌పూర్, మధుబని, షేక్‌పురాల్లో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. అయితే సివాన్‌ పట్టణంలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ జేపీ చౌక్‌ ప్రాంతంలో జాతీయరహదారి గుండా రాకపోకలను నిలిపేశారు. దుకాణాలను మూసేశారు. 

పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకున్న పోలీసులపైకి ఉద్యమకారులు రాళ్లతో దాడిచేశారు. ట్రాఫిక్‌ పోలీస్‌బూత్‌లను ధ్వంసంచేశారు. విద్యార్థుల రాళ్ల దాడిలో సివాన్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పురన్‌ కుమార్‌ ఝా గాయపడ్డారు. దీంతో బాష్పవాయుగోళాలు ప్రయోగించాలని ఆయన ఆదేశించారు. 

అయితే ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారిని నిలువరించేందుకు జిల్లా నిఘా విభాగానికి చెందిన అభిషేక్‌ పటేల్‌ అనే కానిస్టేబుల్‌ తన వద్ద ఉన్న ఏకే–47ను విద్యార్థుల పైకి ఎక్కుపెట్టారు. నాలుగు రౌండ్లు కాలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తాజాగా ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ ఝా ప్రకటించారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో అటుగా వెళ్తున్న కుమార్‌ గోండ్‌ ఒక వ్యక్తి కాలులోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. అయితే ఉద్యమకారులు నాటుబాంబులు విసిరేయడంతోనే ఈ కాల్పుల ఘటన జరిగిఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. 

వాళ్లేమైనా ఉగ్రవాదులా?
న్యూఢిల్లీ: బిహార్‌లో నీట్‌ లీకేజీ నిరసనోద్యమంలో విద్యార్థులపైకి పోలీసులు ఏకే–47 గన్‌ను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్‌’లో రాహుల్‌ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మోదీ ప్రభుత్వసారథ్యంలో యావత్‌ పోలీస్‌వ్యవస్థ విద్యార్థులను హతమార్చే స్థాయికి దిగజారింది. బిహార్‌లో ఏకే–47 గన్‌ను విద్యార్థులపైకి గురిపెట్టారు. వందలాది మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌చేశారు. 

మోదీజీ.. విద్యార్థులపై ఒక్క ఎఫ్‌ఐఆర్‌ నమోదుకాబోదన్న మీ వాగ్దానం ఏమైంది? ఢిల్లీలో పెల్లెట్‌ గన్స్‌ వాడితే బిహార్‌లో ఏకంగా ఏకే–47ను వాడా రు’’అని అన్నారు. ఏకే–47 గురిపెట్టిన ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. ‘‘మీ అమ్మాయిలను నిరసనలకు ఎందుకు పంపించారు? అని తల్లిదండ్రులను కొందరు నేతలు మందలిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యమంలో పాల్గొనకూడదా? ఏకే47, పెల్లెట్‌ గన్స్‌ వాడొచ్చా? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? ’’అని ప్రియాంక నిలదీశారు. 

కాల్పుల ఘటనపై సుప్రీంలో పిల్‌ 
సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజ్యస భ సభ్యుడు, ఆర్జేడీ నేత మనోజ్‌ కుమార్‌ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా బిహార్‌లో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై జరిగిన లాఠీచార్జి తదితర ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement